సారీ, సిగ్గుపడ్తున్నా: బొత్స, లోపలోటి బయటొకటని టిపై
హైదరాబాద్: కాపులను ఎప్పుడో బిసి జాబితాలో చేర్చాల్సిందని, ఆలస్యంపై తాను సిగ్గుపడుతున్నానని, క్షమాపణలు చెబుతున్నానని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షులు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సోమవారం అన్నారు. తమను బిసి జాబితాలో చేర్చాలని కాపు, తెలగ, బలిజలు గాంధీ భవన్ ఎదుట ఆందోళన చేపట్టారు.
ఈ సందర్భంగా బొత్స మాట్లాడారు. ఈ మూడు వర్గాలను బిసి జాబితాలో చేర్పించేందుకు కృషి చేస్తానన్నారు. బిసి జాబితాలో చేర్చడం ఇప్పటికే ఆలస్యమైందన్నారు. కాపులను బిసిల్లో చేర్చాలనేది న్యాయమైన డిమాండ్ అన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో ఈ అంశంపై చర్చించి చర్యలు తీసుకుంటామన్నారు.
ఈ నెల 10వ తేదీలోగా సిఎంతో సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. మంగళవారం ఈ వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు, మంత్రులతో భేటీ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. కాపు సామాజిక ఆర్థిక సర్వేకు నివేదిక ఇవ్వాలన్నారు. కాగా, బొత్స హామీ ఇవ్వడంతో వారు తమ ఆందోళనను విరమించారు.
లోపలొకటి బయటొకటి
విభజన విషయంలో బిఏసికి వెళ్లిన వారు లోపలొకటి, బయట ఒకటి చెబుతున్నాయని, అందుకే సభ ముందుకు వెళ్లడం లేదని బొత్స అన్నారు. సభ నిర్వహణపై అసెంబ్లీలో సభ్యుల అభిప్రాయం తీసుకోవాలన్నారు.
చర్చ జరగాలి: తోట
తెలంగాణ ముసాయిదా బిల్లు పైన సభలో చర్చ జరగాలని మంత్రి తోట నర్సింహం వేరుగా అన్నారు. సీమాంధ్ర ప్రజాప్రతినిధులు సభలో మాట్లాడాలన్నారు. పార్టీలకతీతంగా అందరు కలిస్తే రాష్ట్రం ఎట్టి పరిస్థితుల్లో విడిపోదన్నారు.