మోడీ ప్రధాని కావాలి, బిజెపితోనే సాధ్యం: పురంధేశ్వరి
తూర్పు గోదావరి: భారతీయ జనతా పార్టీ ప్రధాని అభ్యర్థి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ దేశ ప్రధాని కావాలని ప్రజలు కోరుకుంటున్నారని ఆ పార్టీ నేత పురంధేశ్వరి అన్నారు. బిజెపి చేపట్టిన ‘మోడీ ఫర్ పిఎం-సీమాంధ్ర అభివృద్ధి' యాత్ర గురువారం తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి చేరుకుంది. ఈ సందర్భంగా పురంధేశ్వరి మాట్లాడుతూ.. దేశ అభివృద్ధి బిజెపితోనే సాధ్యమవుతుందని అన్నారు.
ప్రపంచ దేశాల్లో భారతదేశం అగ్రగామిగా ఉండాలంటే నరేంద్ర మోడీని ప్రధాని చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆమె తెలిపారు. మోడీ మాత్రమే దేశంలో దారిద్ర్య రేఖకు దిగువగా ఉన్న పేదవారి సంక్షేమానికి పాటుపడగలరని పేర్కొన్నారు. కాగా, పురంధేశ్వరి సమక్షంలో పలువురు నాయకలు, కార్యకర్తలు బిజెపిలో చేరారు.
స్థానికంగా జిల్లాలోని పార్టీ శ్రేణులతో ఈ సందర్భంగా బిజెపి సమావేశం ఏర్పాటు చేసింది. ఆంధ్రప్రదేశ్ (సీమాంధ్ర) రాష్ట్ర అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు, సీనియర్ నాయకులు కృష్ణంరాజు, జాతీయ కార్యవర్గ సభ్యుడు సోమవీర రాజు ప్రసంగించారు.
నరేంద్ర మోడీ ప్రధాని అయితేనే సీమాంధ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని వారు తెలిపారు. ఈ సమావేశంలో బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు బండారు రఘుమోహన్ రావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నన్నపనేని శ్రీధర్ రెడ్డి, తూర్పు గోదావరి మాజీ ఎమ్మెల్యే అయ్యాజి వేమలు పాల్గొన్నారు.