సింగపూర్ వెళ్లాలి, పాస్ పోర్టు ఇప్పించండి, వైసీపీ పిన్నెల్లి
విదేశాలకు వెళ్లడానికి అనుమతి ఇవ్వాలని వైసీపీ మాజీ ఎమ్మెల్యే, ఆ పార్టీ వివాదాస్పద నాయకుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు. విదేశాలకు ఎందుకు వెళ్లాలి అని అనుకుంటున్నాను అనేక పూర్తి వివరాలను పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు తెలిపారు. పోలీసుల తరఫున న్యాయవాది అశ్వినీకుమార్ కోర్టులో వాదనలు వినిపిస్తూ కౌంటర్ పిటిషన్ దాఖలు చేయడానికి సమయం కావాలని కోర్టుకు మనవి చేశారు.
పోలీసుల తరపున న్యాయవాది మనవిని అంగీకరించిన హైకోర్టు ఈనెల 28వ తేదీకి విచారణ వాయిదా వేసింది. అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సమయంలో వైసీపీ నాయకుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నానా హంగామా చేయడం, ఈవీఎం పగలగొట్టడం చేశారని, ఆ తరువాత మరో వ్యక్తి మీద దాడి చేశారని ఆరోపిస్తూ కారంపూడి, రెంటచింతల పోలీసులు పిన్నెల్లిపై కేసులు నమోదు చేశారు. ఈ కేసులలో అరెస్టు అయ్యి జైలుకు వెళ్లిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆ తర్వాత కోర్టులో షరతులతో బెయిల్ తీసుకుని బయటకు వచ్చారు.

పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పాస్ పోర్టును పోలీసులు సీజ్ చేశారు. తాను విదేశాలకు వెళ్లాలని, తనకు పాస్ పోర్టు ఇప్పించాలని వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో పిన్నెల్లి పిటీషన్ విచారణ జరిగింది. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తరఫున న్యాయవాది రామలక్ష్మణ రెడ్డి హైకోర్టులో వాదనలు వినిపించారు.
పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కుమారుడు సింగపూర్ లో ఉన్నత విద్యాభ్యాసం చేయడానికి వెళ్తున్నాడని, కొడుకు బాగోగులు చూసుకోవడానికి మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కూడా సింగపూర్ వెళ్లడానికి అవకాశం ఇవ్వాలని హైకోర్టుకు మనవి చేశారు. పోలీసులు తరఫున న్యాయవాది అశ్వినీకుమార్ పిటీషన్ దాఖలు చెయ్యడానికి సమయం కావాలని మనవి చెయ్యడంతో పిన్నెల్లి పిటీషన్ విచారణ ఈనెల 28వ తేదీకి వాయిదా పడింది.












Click it and Unblock the Notifications