సామాజిక దూరం పేరుతో హైదరాబాద్ లో నిమ్మగడ్డ తిష్ట వెనుక.. వ్యూహం అదేనా ..!
ఏపీలో స్ధానిక ఎన్నికల పోరు వాయిదా వెనుక కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ సామాజికవర్గం కుట్ర ఉందంటూ గతంలో సీఎం జగన్ ఆరోపించారు. సీఎం వ్యాఖ్యలతో ఆయన కేబినెట్ లోని మంత్రులతో పాటు వైసీపీ ఎమ్మెల్యేలు నేతలు కూడా నిమ్మగడ్డపై విరుచుకుపడటం మొదలుపెట్టారు. చివరికి ఎన్నికల వాయిదాను సుప్రీంకోర్టు ఖరారు చేయడంతో చేసేది లేక వైసీపీ సర్కారు ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టిసారించింది. ఆ తర్వాత వైసీపీ దాడుల నేపథ్యంలో భద్రత కోరుతూ కేంద్ర హోంమంత్రికి లేఖ రాసిన నిమ్మగడ్డ .. హైదరాబాద్ వెళ్లిపోయారు. కానీ హైదరాబాద్ వెళ్లడం వెనుక కరోనా వైరస్ ప్రభావంతో సామాజిక దూరం పాటిస్తున్నట్లు చెబుతున్నా అంతకు మించిన కారణాలు ఉన్నట్లు తెలుస్తోంది.

హైదరాబాద్ కు నిమ్మగడ్డ..
ఏపీలో స్ధానిక ఎన్నికల వాయిదా నేపథ్యంలో వైసీపీ దాడుల భయంతో హైదరాబాద్ వెళ్లిపోయిన ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ అక్కడి నుంచే విధులు నిర్వర్తిస్తున్నట్లు ఇవాళ ఓ ప్రకటన చేశారు. కరోనా ప్రభావంతో సామాజిక దూరం పాటిస్తున్నట్లు నిమ్మగడ్డ తరఫున ఎన్నికల కమిషనర్ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. అయితే నిమ్మగడ్డ హైదరాబాద్ వెళ్లడం వెనుక మరే ఇతర కారణాలు లేవా అంటే కచ్చితంగా చెప్పలేని పరిస్ధితి. దీంతో ఇప్పుడు వాటిపైనే ఎక్కువగా చర్చ జరుగుతోంది.

విమర్శలతో టీడీపీకి దూరంగా...
కరోనా వైరస్ ప్రభావంతో స్ధానిక ఎన్నికలు వాయిదా వేసినట్లు నిమ్మగడ్డ రమేష్ ప్రకటించినా వాటి వెనుక ఆయన సామాజిక వర్గ కుట్ర ఉందని, మాజీ సీఎం చంద్రబాబే ఆయన్ను నియమించారని సీఎం జగన్ తీవ్ర ఆరోపణలు చేశారు. దీంతో కమ్మ సామాజికవర్గానికి మేలు చేసేందుకే కమిషనర్ ఈ నిర్ణయం తీసుకున్నారా అన్న చర్చ మొదలైంది. అదే సమయంలో ఎన్నికల కమిషనర్ నిర్ణయాన్ని కులం కోణంలో వ్యతిరేకించిన జగన్ వ్యాఖ్యలపైనా విమర్శలు వ్యక్తమయ్యాయి. దీంతో ఇప్పుడు తన భద్రతపై కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాసి హైదరాబాద్ వెళ్లడంపై చర్చ జరుగుతోంది. ఎెన్నికల కమిషనర్ గా నిష్పాక్షికంగా వ్యవహరించాల్సిన అవసరం కమిషనర్ కు ఉంటుంది. కానీ ఎన్నికల వాయిదాపై ఏకంగా సీఎం స్ధాయి వ్యక్తే ఆరోపణలు చేసిన నేపథ్యంలో నిమ్మగడ్డ నిష్పాక్షిత చర్చకు వచ్చింది. దీంతో ఆయన తీవ్ర మనస్తాపం చెందినట్లు తెలుస్తోంది. అందుకే ఈ ఆరోపణల నుంచి బయటపడేందుకే ఆయన హైదరాబాద్ వెళ్లిపోయినట్లు తెలుస్తోంది.

అమిత్ షా కు లేఖ కూడా కారణమే..
వాస్తవానికి ఎన్నికల వాయిదా నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్ధించిన తర్వాత వైసీపీ నేతల నుంచి తనపై దాడులు జరగొచ్చని నిమ్మగడ్డ భావించారు. ఇదే కారణంతో తనకు భ భద్రత కల్పించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ కూడా రాశారు. దీన్ని ఇవాళ హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి కూడా నిర్ధారించారు. దీంతో నిమ్మగడ్డకు అదనపు భద్రత కూడా కల్పించారు. కానీ నిమ్మగడ్డ రాసిన లేఖ టీడీపీ నేతల నుంచి వచ్చిందనే కారణంతో వైసీపీ ఆయనపై తీవ్ర విమర్శలకు దిగుతోంది. వీటిని నిమ్మగడ్డ చూసీ చూడనట్లుగా వదిలేశారు. అయితే ప్రజల్లో దీనిపై జరుగుతున్న చర్చ నేపథ్యంలో హైదరాబాద్ లో ఉంటే టీడీపీతో పాటు సొంత సామాజిక వర్గ నేతలకు కూడా దూరంగా ఉండొచ్చని కమిషనర్ నిమ్మగడ్డ భావిస్తున్నారా అన్న ప్రచారం మొదలైంది.

అదేం లేదంటున్న ఎస్ఈసీ వర్గాలు..
అయితే విమర్శలు, ఇతర కారణాలతో కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ హైదరాబాద్ వెళ్లి ఉండొచ్చన్న ప్రచారాన్ని కమిషన్ వర్గాలు అనధికారికంగా ఖండిస్తున్నాయి. ఎన్నికలు వాయిదా పడినందున, కరోనా వైరస్ ప్రభావం కూడా ఉన్నందున హైదరాబాద్ వెళ్లి ఉండొచ్చని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications