దేశాన్ని విచ్చిన్నం చేసేందుకు మోడీ కుట్ర...బాలయ్య అభివృద్ది చేయలేదు:సిపిఐ
తిరుపతిః ప్రధాని నరేంద్రమోడి మతం పేరుతో దేశాన్ని విచ్చన్నం చేసే కుట్ర చేస్తున్నారని సిపిఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ విమర్శించారు. బికెఎంయు జాతీయ మహాసభల్లో పాల్గొనేందుకు తిరుపతికి వచ్చిన నారాయణ గురువారం మీడియాతో మాట్లాడారు.
నోట్ల రద్దు వల్ల కోటీశ్వరులందరూ సుఖపడ్డారని, సామాన్యులు మాత్రం నానా అవస్తలు పడ్డారని చెప్పారు. ఆ క్రమంలో 150 మందికి పైగా పేదలు డబ్బులు అందక చనిపోయారని నారాయణ గుర్తు చేశారు. నోట్లు రద్దును వ్యతిరేకించిన చంద్రబాబు, కేసిఆర్ ఢిల్లీకి వెళ్ళి వచ్చిన తర్వాత మోడిని పొగడటం వెనక పరమార్దం ఏమిటో ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందన్నారు.
రైతులకు రుణమాఫి చేయమంటే డబ్బులు లేవంటున్న పాలకులు కార్పోరేట్ వ్యక్తులకు వేల కోట్లు పన్ను రాయతీలు ఎలా ఇస్తారని నారాయణ ప్రశ్నించారు. బిజేపిని ఓడించేందుకు అన్ని రాజకీయ పార్టీలు ఏకతాటి పైకి రావాలని నారాయణ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
మరోవైపు అనంతపురం జిల్లా హిందూపురం పట్టణంలో సిపిఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ ,సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు వి శ్రీనివాసరావు లు మీడియా సమావేశంలో మాట్లాడారు. హిందూపురం నియోజకవర్గాన్ని ఎమ్మెల్యేగా నందమూరి బాలకృష్ణ ఆశించిన స్థాయిలో అభివృద్ధి చేయలేదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ చెప్పారు. నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్న బాలకృష్ణ, ఎమ్మెల్యే లు అధికారాన్ని అడ్డుపెట్టుకుని చివరకు చెరువులను సైతం కబ్జాలు చేసి... పారిశ్రామికదారులకు ధారాదత్తం చేస్తున్నారని విమర్శించారు.
అనంతపురం జిల్లా వ్యాప్తంగా వేలాది ఎకరాల భూమిని పరిశ్రమల స్థాపన కోసం భూసేకరణ చట్టం ద్వారా సేకరించారని సిపిఎం నేత శ్రీనివాసరావు దుయ్యబట్టారు. గత నాలుగు సంవత్సరాల టిడిపి పాలనలో జిల్లాకు ఎన్ని పరిశ్రమను తీసుకు వచ్చారని ఆయన ప్రశ్నించారు. పరిశ్రమల కోసం శంకుస్థాపనలు జరుగుతున్నాయే తప్ప ఒక్క పరిశ్రమ కూడా ప్రారంభానికి నోచుకోవడం లేదన్నారు. అధికార పార్టీ నాయకులు,ప్రజాప్రతినిధులకు పరిశ్రమల యాజమాన్యాలు భయపడి పరిశ్రమలు స్థాపించకుండానే పారిపోతున్నారని ఎద్దేవా చేశారు. స్థానికంగా ఉన్న పరిశ్రమల్లో స్థానికులకు 85శాతం 15శాతం స్థానికేతరులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు.