ఆ పేరు వింటే రోషం, ఆవేశం పొంగుకొస్తుంది..
Chandrababu: పాకిస్తాన్ పై భారత్ సాధించిన విజయానికి గుర్తుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం.. విజయవాడలో తిరంగా ర్యాలీ నిర్వహించింది.
చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు, ఆ పార్టీ రాజమండ్రి లోక్ సభ సభ్యురాలు పురంధేశ్వరి.. ఈ ర్యాలీలో పాల్గొన్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఈ మూడు పార్టీలకు చెందిన సీనియర్ నాయకులు దీనికి హాజరయ్యారు. జాతీయ జెండాలను చేతబట్టుకుని సైనికులకు సంఘీభావం తెలియజేశారు.

ఈ సందర్భంగా నిర్వహించిన సభలో చంద్రబాబు మాట్లాడారు. వందే మాతరం అంటూ నినదించారు. భారత ఆర్మీ పరాక్రమానికి గుర్తుగా 175 నియోజకవర్గాల్లో తిరంగా ర్యాలీని చేపట్టామని అన్నారు. 18వ తేదీ వరకు ఈ తిరంగ యాత్రలు కొనసాగుతాయని వివరించారు. ప్రజలందరూ ఇందులో పాల్గొనాలని పిలుపునిచ్చారు.
భారత్ ఎప్పుడు కూడా వేరే దేశంపై యుద్ధానికి పోలేదని, ఉగ్రవాదంపై మాత్రమే నిరంతరాయంగా పోరాడిందని అన్నారు. ఉగ్రవాదం.. ఈ ప్రపంచం మొత్తాన్ని పట్టి పీడిస్తోందని, దీనిపై పోరాడే ఏకైక దేశం భారత్ ఒక్కటేనని అన్నారు. ఉగ్రవాదంపై పోరాడే నాయకుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక్కడేనని స్పష్టం చేశారు.
పహల్గామ్ పేరు వినగానే రోషం, ఉద్వేగం, కోపం, బాధ, ఆవేశం పొంగుకొస్తుందని చంద్రబాబు అన్నారు. ఆ విషాదం గుర్తుకొచ్చి రక్తం మరిగిపోతుందని చెప్పారు. భార్య ముందే భర్తను, కొడుకు ముందే తండ్రిని ఉగ్రవాదులు మతం పేరు అడిగి మరీ చంపేశారని, ఇదెక్కడి న్యాయమని చంద్రబాబు ప్రశ్నించారు.
ఇవన్నీ చూసిన తరువాతే ప్రధాని మోదీ ఆపరేషన్ సింధూర్కు శ్రీకారం చుట్టారని చంద్రబాబు గుర్తు చేశారు. జాతీయ పతాకాన్ని చూడగానే అందరిలోనూ ఉత్సాహం ఉరకలు వేస్తుందని, అలాంటి జెండాకు రూపకల్పన చేసిన పింగళి వెంకయ్య ఈ ప్రాంతానికి చెందినవాడే కావడం గర్వకారణమని అన్నారు.
అత్యంత కఠిన పరిస్థితుల్లో సరిహద్దుల్లో రాత్రి పగలు తేడా లేకుండా దేశాన్ని కాపాడుతున్న జవాన్లకు చేతులెత్తి నమస్కరిస్తున్నానని చంద్రబాబు అన్నారు. వాళ్లు పోరాడటం వల్లే తాము ఇక్కడ క్షేమంగా ఉండగలుగుతున్నామని చెప్పారు. దేశ బలం.. బలగం మొత్తం సైనికులేనని ప్రశంసించారు.
దేశ త్రివిధ దళాల పరాక్రమం ఎలాంటిదో ప్రపంచం మొత్తం చూసిందని, దేశ విదేశాల్లో ఉండే శత్రువుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయని చంద్రబాబు పేర్కొన్నారు. తాము ఎవరి జోలికి వెళ్లబోమని, ఉగ్రవాదులు తమ జోలికి వస్తే మాత్రం వారికి అదే చివరి రోజు అవుతుందని ఆపరేషన్ సింధూర్ రుజువు చేసిందని చెప్పారు.
VIDEO | "Terrorism a global threat, PM Modi leading the fight against it," says Andhra Pradesh CM N Chandrababu Naidu (@ncbn) at Tiranga Yatra in Vijayawada.
— Press Trust of India (@PTI_News) May 16, 2025
(Full video available on PTI Videos - https://t.co/n147TvqRQz) pic.twitter.com/JpKXtajipS












Click it and Unblock the Notifications