రాజకీయ, సినీ ప్రముఖుల రాక-మెగా, నందమూరి హీరోల సందడి..!!
ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం కొలువు తీరుతోంది. ప్రమాణ స్వీకారోత్సవం కోసం రాజకీయ - సినీ ప్రముఖులు తరలి వస్తున్నారు. ఇప్పటికే పలువురు కేంద్ర మంత్రులు విజయవాడ చేరుకున్నారు. సినీ హీరోలు ప్రమాణ స్వీకార ప్రాంగణానిని చేరుకుంటున్నారు. ఈ సారి ప్రమాణ స్వీకారంలో సినీ సెలబ్రెటీలు సందడి చేస్తున్నారు. తెలుగు స్టేట్స్ నుంచే కాదు దేశ నలుమూలల నుంచి వీవీఐపీలు కేసరపల్లికి క్యూకట్టారు. ఏపీలో కొత్త ప్రభుత్వ ప్రమాణ స్వీకార సందడి కొనసాగుతోంది.
ప్రముఖుల రాక
టీడీపీ అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రముఖులు ఒక్కొక్కరుగా వస్తున్నారు. నారా, నందమూరి కుటుంబ సభ్యులు హైదరాబాద్ నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. నారా బ్రాహ్మణి , నారా దేవాన్ష్, నందమూరి వసుంధర, ఇతర కుటుంబ సభ్యులు గన్నవరం చేరుకుని అనంతరం రోడ్డు మార్గాన ఉండవల్లి నివాసానికి వెళ్లారు. ఇక హైదరాబాద్ నుంచి మెగాస్టార్ చిరంజీవి, ఆయన సతీమణి సురేఖ ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. విమానాశ్రయంలో మెగా ఫ్యామిలీకి అభిమానులు ఘనస్వాగతం పలికారు. కేంద్ర మంత్రులు అమిత్షా, జేపీ నడ్డా, రజినీకాంత్, ఇప్పటికే బెజవాడలో ల్యాండ్ అయ్యారు.
మెగా - నందమూరి సందడి
గన్నవరం ఎయిర్పోర్ట్లో గ్రాండ్ వెల్కమ్ అందుకున్న అమిత్షా, నడ్డాలు.. ఆ తర్వాత చంద్రబాబు ఇచ్చిన ప్రత్యేక విందులో పాల్గొన్నారు. ప్రధాని నరేంద్రమోదీ, ఇవాళ ఉదయం పదిన్నర తర్వాత గన్నవరం ఎయిర్పోర్ట్లో ల్యాండ్కానున్నారు. అక్కడి నుంచి నేరుగా కేసరపల్లిలోని ప్రమాణస్వీకార వేదిక దగ్గరకు చేరుకుంటారు. ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండున్నర వరకు వేదికపై ఉండనున్న మోదీ.. ఆ తర్వాత గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ఒడిశాకు బయల్దేరి వెళ్తారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మాజీ సీజేఐ ఎన్వీ రమణ, ఇతర రాష్ట్రాల నుంచి కేంద్ర మంత్రులుగా కొనసాగుతున్న చిరాగ్ పాశ్వాన్, నితిన్ గడ్కరీ, జితిన్ మాంఝి, జయంత్ చౌదరి, అనుప్రియ పటేల్, రాందాస్ అథవాలే, ప్రఫుల్ పటేల్ ముఖ్యఅతిథులుగా హాజరవుతున్నారు.

తరలి వస్తున్న ప్రముఖులు
మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే, మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్, తమిళనాడు మాజీ సీఎం పన్నీర్ సెల్వం, మాజీ గవర్నర్ తమిళిసై కూడా కేసరపల్లికి రానున్నారు. భాజపా రాష్ట్ర ఇన్ఛార్జ్ సిద్ధార్థ్నాథ్ సింగ్తోపాటు పలువురు ప్రముఖులూ విజయవాడ చేరుకున్నారు. ఇక, చంద్రబాబుతో పాటుగా పవన్ ప్రమాణ స్వీకారం వీక్షిచేందుకు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. ప్రధానితో సహా ప్రముఖులు వస్తుండటంతో భారీ బందో బస్తు ఏర్పాటు చేసారు. ప్రమాణ స్వీకారం తరువాత చంద్రబాబు కుటుంబ సభ్యులతో కలిసి సాయంత్రం తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లనున్నారు. రేపే (గురువారం) ఏపీ సచివాలయంలో చంద్రబాబు బాధ్యతలు స్వీకరించనున్నారు.












Click it and Unblock the Notifications