ఒకే వేదికపై మోదీ-చంద్రబాబు-పవన్?: ఏపీ, తెలంగాణల్లో ప్రధాని టూర్
PM Modi: లోక్సభ ఎన్నికల గడువు సమీపించి నేపథ్యంలో కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనత పార్టీ.. ఎన్నికల ప్రచార కార్యక్రమాలపై దృష్టి పెట్టింది. ఈ ఎన్నికల్లో భారీ విజయం సాధించడమే లక్ష్యంగా పెట్టుకుంది. 400 సీట్లను సాధించేలా కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకుంటోంది.
దీన్ని సాధించడానికి అవసరమైన వ్యూహాలపై దేశ రాజధానిలోని భారత్ మండప్ వేదికగా నిర్వహించిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో చర్చించింది. అవే సమావేశాల్లో మోదీని తమ ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించింది బీజేపీ. స్టార్ క్యాంపెయినర్లనూ ఎంపిక చేసింది.

దేశవ్యాప్తంగా మోదీ పాల్గొనాల్సిన బహిరంగ సభలు, రోడ్ షోలకు సంబంధించిన రూట్ మ్యాప్పై కసరత్తు పూర్తి చేసింది. దీని ప్రకారం చూసుకుంటే ఈశాన్యంతో పాటు దాదాపుగా అన్ని రాష్ట్రాల్లోనూ మోదీ బహిరంగ సభలను నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. ఇందులో భాగంగా మార్చి మొదటివారంలో మోదీ దక్షిణాది రాష్ట్రాల్లో పర్యటించబోతోన్నారు.
మార్చి 2వ తేదీన ఏపీ, తెలంగాణల్లో ఆయన పర్యటన షెడ్యూల్ ఖరారైనట్లు తెలుస్తోంది. ఒకే రోజున ఈ రెండు రాష్ట్రాల్లో బహిరంగ సభల్లో పాల్గొంటారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా బీజేపీ ఈ నిర్ణయం తీసుకుందని, ఏర్పాట్లు చేయాల్సిందిగా రెండు తెలుగు రాష్ట్రాల అధ్యక్షులు పురంధేశ్వరి, జీ కిషన్ రెడ్డికి సమాచారం ఇచ్చిందని పేర్కొంటోన్నాయి.
ఏపీలో తెలుగుదేశం- జనసేన కూటమితో కలిసి బీజేపీ ఎన్నికలకు వెళ్లడానికి సిద్ధపడిందంటూ వార్తలు వస్తోన్న నేపథ్యంలో- మోదీ తెలుగు రాష్ట్రాల్లో పర్యటించబోతోండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. అదే జరిగితే- మోదీతో కలిసి చంద్రబాబు, పవన్ కల్యాణ్ వేదికను పంచుకోవడం ఖాయం.
బీజేపీతో పొత్తుపై ఈ నెల 21వ తేదీన చంద్రబాబు ప్రకటన చేసే అవకాశం ఉంది. పొత్తులో భాగంగా బీజేపీ- జనసేనలకు కలిపి 30 అసెంబ్లీ, 10 లోక్సభ స్థానాలను కేటాయించాలని ఆయన నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ 30 అసెంబ్లీ, 10 లోక్సభ స్థానాలను బీజేపీ-జనసేన పంచుకోవాల్సి ఉంటుంది.












Click it and Unblock the Notifications