చంద్రబాబుకు, విజయవాడకు తియ్యటివార్త చెప్పిన నరేంద్రమోడీ
ఆంధ్రప్రదేశ్ లోని కీలకమైన తొమ్మిది రహదారుల ప్రాజెక్టులను జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ 2024-25 వార్షిక ప్రణాళికలో చేర్చింది. వీటికి రూ.12,029 కోట్ల నిధులను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ఇందులో భాగంగా విజయవాడ రామవరప్పాడు నుంచి నిడమానూరు వరకు ఏడు కిలోమీటర్ల మేర ఇన్నోవేటివ్ సూపర్స్ట్రక్చర్ డిజైన్తో ఈ వంతెన నిర్మించబోతున్నారు. దీనికి రూ.669 కోట్లు కేటాయించారు. ఈ ప్రాజెక్టు కోసం భూసేకరణ చేయకుండా ప్రస్తుతం ఉన్న హైవే డివైడర్లలో పిల్లర్లు వేసి నాలుగు వరుసలతో వంతెన నిర్మిస్తారు. దీనిపై సాధ్యాసాధ్యాలను చర్చించేందుకు కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులతో ఎన్ హెచ్ఏఐ అధికారులు సమావేశం నిర్వహించబోతున్నారు.
త్వరలోనే టెండర్లు పిలవబోతున్నారు.
తొమ్మిది ప్రాజెక్టుల్లో ఎనిమిది ప్రాజెక్టులకు డీపీఆర్ పూర్తిచేసి త్వరలోనే టెండర్లు పిలిచి పనులు అప్పగించబోతున్నారు. విజయవాడ-గుంటూరు మధ్యలో ఉన్న కాజా టోల్ ప్లాజాకు తూర్పువైపున కృష్ణా జిల్లాలోని చిన ఆవుటపల్లి వరకు మరో బైపాస్ రోడ్డు సిద్ధమైంది. 50 కిలోమీటర్ల ఉండే ఈ రహదారికి రూ.2716 కోట్లు కేటాయించారు. అధికారులతో చర్చించి ఈ నెలాఖరుకు మూడు ఎలైన్ మెంట్లను జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ప్రధాన కార్యాలయానికి పంపించి వాటిల్లో ఒకటి ఖరారు చేస్తారు. అది ఖరారైన తర్వాతే డీపీఆర్ తోపాటు భూసేకరణ చేస్తారు.

మార్చిలో వంతెన పనులు
రామవరప్పాడు నుంచి నిడమానూరు వరకు నిర్మించే వంతెన పనులు మార్చిలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. వంతెన నిర్మాణ సమయంలో ట్రాఫిక్ ను మళ్లించాల్సి ఉండటంతో దీనికి సంబంధించిన ప్రతిపాదనలను రహదారులు, భవనాలశాఖ అధికారులు సిద్ధం చేస్తున్నారు. వీటితోపాటు గుంటూరు నుంచి వినుకొండ వరకు 90 కిలోమీటర్లు, బద్వేలు నుంచి నెల్లూరు వరకు 108 కిలోమీటర్లు, నెల్లూరు నుంచి కృష్ణపట్నం పోర్టు వరకు నాలుగు వరుసలుగా రహదారులను అభివృద్ధి చేస్తారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలోని పెనుకొండ మండలంలో ఉన్న కియా కార్ల పరిశ్రమ దగ్గర ఆర్వోబీ నిర్మాణానికి రూ.140 కోట్లు కేటాయించడం జరిగింది.












Click it and Unblock the Notifications