ఆ ముగ్గురికి పిఎంవో పిలుపు: కిరణ్ రెడ్డి మెత్తబడతారా?
న్యూఢిల్లీ/హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణలకు ప్రధానమంత్రి కార్యాలయం నుండి శుక్రవారం పిలుపు వచ్చింది. శనివారం ఉదయం పదిన్నర గంటలకు పిఎంవోకు రావాలని సూచించింది. సమైక్యవాదం బలంగా వినిపిస్తున్న ముఖ్యమంత్రి విషయంలో ప్రధాని దౌత్యం చేస్తారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఈ భేటీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెసు పార్టీ వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్కు కూడా పిలుపు వచ్చింది. అంతేకాకుండా అందుబాటులో ఉన్న రాష్ట్రానికి చెందిన మంత్రులు, పార్లమెంటు సభ్యులు రావొచ్చునని పిఎంవో తెలిపింది. అయితే, ఈ భేటీ ఇటీవల వచ్చిన వరదలు, వర్షాల వల్ల వచ్చిన నష్టం పైన చర్చ జరగనుంది. అదే సమయంలో విభజన అంశం కూడా చర్చకు వచ్చే అవకాశముందని చెబుతున్నారు. వరదలు, వర్షాల నేపథ్యంలో ప్రధాని అపాయింటుమెంటును కిరణ్ కోరారు.
ఢిల్లీకి చేరుకున్న కిరణ్
ఈ రోజు సాయంత్రం జరగనున్న సమన్వయ కమిటీ భేటీకి హాజరయ్యేందుకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఢిల్లీకి చేరుకున్నారు. ఈ భేటీలో దిగ్విజయ్, కిరణ్, బొత్స సత్యనారాయణ, దామోదర రాజనర్సింహ, కేంద్రమంత్రి చిరంజీవి, ఏఐసిసి ఇంఛార్జి కార్యదర్శి తిరునావక్కరసులు హాజరు కానున్నారు.
కిరణ్ మెత్తబడతారా?
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి విభజన విషయంలో మెత్తబడ్డారా? లేక మెత్తబడతారా? అనే చర్చ సాగుతోంది. కిరణ్ బలంగా సమైక్యవాదం వినిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయనను తప్పిస్తారనే ప్రచారం జోరుగా సాగింది. అయితే ఈ రోజు డిగ్గీ మాట్లాడుతూ కిరణ్ కొనసాగుతారని చెప్పారు. అదే సమయంలో పార్టీకి ఆయన విశ్వాసపాత్రుడని చెప్పారు. అధిష్టానం, ప్రధాని.. ఇలా పలువురి దౌత్యంతో కిరణ్ మెత్తబడవచ్చునని అంటున్నారు.