కొడాలి నానికి నోటీసులు: పెద్దిరెడ్డి, అనంత అరెస్ట్: పూలు ఇచ్చి నిరసన తెలిపిన అంబటి
మెగా డీఎస్సీ నియామకాల్లో చోటు చేసుకున్నట్లు భావిస్తోన్న అవకతవకలపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యాప్త నిరసన ర్యాలీలు చేపట్టింది. అన్ని నియోజకవర్గాల్లోనూ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వేల సంఖ్యలో తరలివచ్చారు. తమ నిరసన గళాన్ని ప్రభుత్వానికి వినిపించే ప్రయత్నం చేశారు.
అనంతపురం జిల్లా తాడిపత్రిలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీకి ఏర్పాట్లు చేయగా పోలీసులు అడ్డుకున్నారు. పెద్దారెడ్డి స్వగృహం నుంచి బయటకు వస్తుండగా పోలీసులు నిలువరించడంతో వాగ్వాదం చోటుచేసుకుంది. పార్టీ కార్యకర్తలు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. తాడిపత్రికి వస్తున్న పార్టీ శ్రేణుల వాహనాలను కూడా పోలీసులు అడ్డుకున్నారు. డీఎస్సీ అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేశ్ రాజీనామా చేయాలని పెద్దారెడ్డి డిమాండ్ చేశారు.

కేతిరెడ్డి పెద్దారెడ్డికి సంఘీభావాన్ని తెలియజేయడానికి తాడిపత్రికి బయలుదేరి వెళ్లిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, ఆయనతో పాటు ఉన్న అనంత వెంకట్రామిరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ముచ్చుకోట వద్ద వారిని అడ్డుకున్నారు. దీంతో వాళ్లు రోడ్డుపైనే బైఠాయించి, నిరసన తెలిపారు. టీడీపీ కూటమి ప్రభుత్వం, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాష్ట్రంలో పోలీసు జులం నడుస్తోందంటూ మండిపడ్డారు.
మరోవంక.. గుడివాడలో కూడా ఇదే తరహా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మాజీ మంత్రి కొడాలి నానిని పోలీసులు గృహ నిర్బంధంలో ఉంచారు. ఆయనను ఇంటి నుంచి బయటికి రానివ్వలేదు. ఇంటి వద్ద భారీ సంఖ్యలో పోలీసుల బలగాలు మోహరించారు. ఇంట్లో ఉన్నా కూడా హౌస్ అరెస్ట్ చేయడమేంటని కొడాలి నాని తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ విషయం తెలిసిన వెంటనే భారీ సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యర్తలు, అభిమానులు ఆయన ఇంటికి చేరుకున్నారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది.
అనంతరం కొడాలి నాని మాట్లాడారు. డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. స్పోర్ట్స్ కోటా లో అవకతవకలపై పూర్తి విచారణ జరపాలని అన్నారు. డబ్బులకు అమ్మిన ఉద్యోగాలను నిజమైన అర్హులకు ఇవ్వాలని పట్టుబట్టారు. తాము కొన్ని నెలలుగా పోరాడుతున్నామని, చంద్రబాబు తన కొడుకుని కాపాడుకోవడానికి పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకున్నారని మండిపడ్డారు.
అర్ధరాత్రి మా నాయకుల ఇళ్లకు వెళ్లి నోటీసులు ఇవ్వడం,ర్యాలీకి వస్తే కేసులు పెట్టి అరెస్ట్ చేస్తాం అని కార్యకర్తలకు ఫోన్లు చేస్తూ భయపెడుతున్నారని ఆరోపించారు. పోలీసులతో ప్రజా ఉద్యమాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపలేరని, ఢిల్లీలో విద్యార్థులపై పోలీసులతో లాఠీఛార్జీ చేయించిన కేంద్ర ప్రభుత్వమే చివరికి దిగొచ్చిందని, మంత్రి రాజీనామా చేయాల్సి వచ్చిందని గుర్తుచేశారు. ఇక్కడా అదే పరిస్థితి వస్తుందని అన్నారు. మరోవంక గుంటూరులో పోలీసులకు పూలను ఇచ్చి మాజీ మంత్రి అంబటి రాంబాబు నిరసన తెలిపారు.




Click it and Unblock the Notifications