అంబటి రాంబాబుపై మరో కేసు - ముద్రగడ అంత్యక్రియల వేళ..!!
వైసీపీ ముఖ్య నేత అంబటి రాంబాబు పైన మరో కేసు నమోదు అయింది. కొంత కాలంగా వరుస వివాదాలతో అంబటి రాంబాబు కేసుల్లో చిక్కుకుంటున్నారు. తాజాగా ముద్రగడ పద్మనాభం అంత్య క్రియల వేళ ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని నిర్ణయించింది. దీంతో, పోలీసులు అందుకు సిద్దమయ్యారు. ఆ సమయంలో వారితో అంబటి రాంబాబు దురుసుగా వ్యవహరించారు. పోలీసు సిబ్బంది ఇచ్చిన ఫిర్యాదు మేరకు అంబటి రాంబాబు పైన కిర్లంపూడి పోలీసు స్టేషన్ లో కేసు నమోదు చేసారు.
మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కిర్లంపూడి పోలీస్ స్టేషన్లో కేసు నమోదయింది. ప్రభుత్వ నిర్ణయం మేరకు మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల సమయంలో పోలీసు సిబ్బంది గార్డ్ ఆఫ్ ఆనర్ ఇస్తుండగా అంబటి తన మద్దతు దారులతో కలిసి ఆటంకం కలిగించారని ఫిర్యాదులు అందాయి. ప్రభుత్వ ఆదేశాలను అమలు చేస్తున్న తమను ఉద్దేశపూర్వ కంగా తోసేశారని పోలీసులకు అధికారులు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. సెక్షన్లు 132, 3(5) కింద అంబటి రాంబాబు సహా మరికొందరిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసారు. అయితే, తాము ముద్రగడ చివరి కోరికను అమలు చేసామని.. ఆ బాధ్యత తమ పైన ఉందని అంబటి చెప్పుకొచ్చారు. తనకు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు వద్దని ముద్రగడ చెప్పారని అంబటి వివరించారు.

పోలీసుల ఫిర్యాదుతో కేసు నమోదు
కాగా, ముద్రగడ కుటుంబసభ్యులు కిర్లంపూడిలోని ఆయన ఇంటి ఆవరణలో అంత్యక్రియలు నిర్వహించారు. ముద్రగడ అంత్యక్రియల్లో మాజీ ముఖ్యమంత్రి జగన్ పాల్గొని వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. అంత్యక్రియలు పూర్తయ్యే వరకు కిర్లంపూడిలోనే ఉన్నారు. మరణానికి ముందే ముద్రగడ తన కుటుంబసభ్యులకు ఓ లేఖ రాశారు. ఇంటి ఆవరణలోనే తన పార్థివ దేహాన్ని ఖననం చేయాలని, ప్రభుత్వ లాంఛనాలు, పోలీసుల గౌరవ వందనం తనకు అవసరం లేదని ఆ లేఖలో స్పష్టం చేశారని వైసీపీ నేతలు వివరిస్తున్నారు. ఈ కేసులో అంబటి రాంబాబు తో సహా జక్కంపూడి గణేష్, మరి కొందరి పేర్లు ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసులు ఈ కేసులో విచారణ మొదలు పెట్టారు.












Click it and Unblock the Notifications