మాజీ మంత్రి ఆనందబాబు ఇంటికి పోలీసులు : అర్ద్రరాత్రి హైడ్రామా : గంజాయి రవాణాపై వ్యాఖ్యలతో..!!
టీడీపీ నేత..మాజీ మంత్రి నక్కా ఆనందబాబు ఇంటి వద్ద అర్ద్రరాత్రి హైడ్రామా చోటు చేసుకుంది. ఆయన ఇంటికి రాత్రి పొద్దుపోయిన తరువాత విశాఖ జిల్లా నర్సీపట్నం పోలీసులు చేరుకున్నారు. సోమవారం ఆనంద్ బాబు గంజాయి దందా పైన మీడియా సమావేశంలో పలు ఆరోపణలు చేసారు. విశాఖ మన్యం నుంచి గంజాయి, మత్తు పదార్థాల రవాణాపై విమర్శలు గుప్పించారు. ఇదే సమయంలో రాజ్యసభ సభ్యుడు విజయ సాయిరెడ్డి పైన పలు ఆరోపణలకు దిగారు. దీంతో...నర్సీపట్నం పోలీసులు ఆనందబాబు నివాసానికి వచ్చారు.
ఆనందబాబు ఆరోపణల పైన పోలీసుల ఆరా
ఆయన చేసిన ఆరోపణల్లో భాగంగా... గంజాయి రవణాకు సంబంధించి ఆధారాలు ఇవ్వాలని సూచిస్తూ నోటీసులు జారీ చేసారు. ఏ ఆధారాలతో ఆయన వ్యాఖ్యలు చేసారో చెబితే స్టేట్ మెంట్ గా రికార్డు చేసుకుంటామంటూ సూచించారు. అయితే, పోలీసుల నోటీసు తీసుకొనేందుకు ఆనందబాబు నిరాకరించారు. ఆ సమయంలో ఆనందబాబు - పోలీసుల మధ్య కొద్ది సేపు వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో..పోలీసులు మంగళవారం మరోసారి వస్తామని చెప్పి వెళ్లిపోయారు. గంజాయి రవాణాపై ఆధారాలు లేదా వివరణ ఇవ్వాలని ఆనంద్బాబును అడిగినట్లు నర్సీపట్నం సీఐ శ్రీనివాసరావు పేర్కొన్నారు.
నోటీసులు ఇచ్చేందుకు ప్రయత్నం - నిరాకరణ
ఆయన వ్యాఖ్యలతో ఆధారాలు లభిస్తాయని నర్సీపట్నం నుంచి గుంటూరు వచ్చామని తెలిపారు. ఆనంద్బాబు అర్ధరాత్రి స్టేట్మెంట్ ఇవ్వను అన్నారు. అందుకే మంగళవారం ఉదయం వస్తామని చెప్పాం. స్టేట్మెంట్ ఇవ్వకుంటే 91 సీఆర్ఫీఎఫ్ కింద నోటీసులు ఇస్తాం. అప్పుడు చింతపల్లి వచ్చి సమాధానం ఇవ్వాల్సి ఉంటుందని సీఐ అన్నారు. దీంతో.. లీసుల తీరుపై ఆనంద్బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. గంజాయి స్థావరాలపై తెలంగాణ పోలీసులు దాడి చేయడం దారుణమన్నారు.
Recommended Video
మరోసారి నోటీసుల జారీకి ప్రయత్నం
దాడి సమయంలో రాష్ట్ర పోలీసులు ఏం చేస్తున్నారని.. గిరిజనులపై దాడి జరిగితే మాట్లాడే హక్కు మాకు లేదా అన్నారు. మాజీ మంత్రిగా మీడియాతో మాట్లాడే స్వేచ్ఛ లేదా అని ప్రశ్నించారు. ప్రస్తుత డీజీపీ కొత్త సంస్కృతి తెస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు. తెదేపా ప్రభుత్వంలో పోలీసులు ఇలానే పని చేశారా అంటూ ప్రశ్నించారు. గతంలో ఇదే రకమైన వ్యాఖ్యలతో టీడీపీ ముఖ్య నేతలకు సైతం పోలీసు ఉన్నతాధికారులు నోటీసులు జారీ చేసారు.
ఈ రకమైన వ్యాఖ్యలతో రాష్ట్ర ప్రతిష్ఠ దెబ్బ తింటుందని సూచించారు. దీంతో..ఇటువంటి వ్యాఖ్యలు చేసిన వారి పైన కఠినంగా ఉండాలని ప్రభుత్వం భావిస్తోంది. అందులో భాగంగా కొద్ది రోజుల క్రితం డ్రగ్స్ పైన ఆరోపణలు చేసిన టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్రకు సైతం కాకినాడ పోలీసులు నోటీసులు ఇచ్చారు.