మునుగోడులో అందరికన్నా పైచేయి వారిదే!!
మునుగోడు.. రెండు తెలుగు రాష్ట్రాల్లో నానుతున్న పేరు. కారణం.. తెలంగాణ రాష్ట్ర సమితి తరఫున కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, భారతీయ జనతాపార్టీ తరఫున కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కాంగ్రెస్ తరఫున పాల్వాయి స్రవంతి హోరాహోరీగా తలపడుతుండటం. భవిష్యత్తులో తెలంగాణలో సంభవించబోయే రాజకీయ పరిణామాలకు మునుగోడు ఉప ఎన్నికే కీలకం కానుంది. అందుకే పార్టీలన్నీ ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రత్యర్థులను ఢీకొడుతున్నాయి.

సెమీఫైనల్ లో గెలిస్తేనే ఫైనల్ కు
రాజగోపాల్ రెడ్డి మొదటి నుంచి నియోజకవర్గంలో పనిచేసుకుంటూ వస్తుండగా చివరి నిముషంలో అభ్యర్థిగా ఎంపికైన కుసుకుంట్ల రంగంలోకి దిగారు. స్రవంతి తన పేరు ఖరారైనప్పటి నుంచి తనపని తాను చేసుకుపోతున్నారు. అందరికన్నా బీజేపీకి ఈ ఎన్నిక అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను ఆత్మవిశ్వసంతో ఎదుర్కోవడానికి మునుగోడు ఉప ఎన్నిక సెమీఫైనల్ గా భావిస్తోంది. ఇక్కడ గెలిస్తే రాష్ట్రవ్యాప్తంగా బీజేపీకి అనుకూల పవనాలు వీస్తున్నాయంటూ ప్రచారం చేసుకొని ఎన్నికలను ఎదుర్కోవడానికి వీలవుతుంది.

నియోజకవర్గంలో తళతళలాడుతున్న పచ్చనోట్లు!
ఒకవేళ ఓటమిపాలైతే శాసనసభ ఎన్నికలను ఆత్మవిశ్వాసంతో ఎదుర్కోలేమని పార్టీ భావిస్తోంది. అందుకే అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఆ పార్టీ నియోజకవర్గంలో చెమటోడుస్తోంది. అభ్యర్థి ఆర్థికంగా అత్యంత బలవంతుడు కావడంతో ఇప్పుడు నియోజకవర్గంలో ఎక్కడ చూసినా పచ్చనోట్లు తళతళలాడుతున్నాయి. కూసుకుంట్ల కూడా రంగంలోకి దిగారు. పార్టీలో చేరికలను మొన్నటివరకు మంత్రి జగదీష్ రెడ్డి ప్రోత్సహించారు. ఇప్పుడు ప్రభాకర్ రెడ్డి అభ్యర్థిత్వం ఖరారు కావడంతో నాయకుల చేరికలకు తెరతీశారు. కాంగ్రెస్ పార్టీ నుంచి నాయకులను తమ తమ పార్టీల్లో చేర్చుకునేందుకు టీఆర్ఎస్, బీజేపీ పోటీపడుతున్నాయి.

మంచినీళ్లలా ఖర్చవుతున్న డబ్బులు?
మునుగోడులో టీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులు డబ్బులు మంచినీళ్లల్లా ఖర్చు చేస్తున్నారంటూ విమర్శలు వస్తున్నాయి. ఎంతమంది నాయకులు తమ పార్టీలో చేరితే అంత బలంగా ఉన్నామనే సంకేతాలను ప్రజల్లోకి పంపించేందుకు నాయకులకు కూడా ఎంతో కొంత చెల్లించడానికి సిద్ధమయ్యారంటూ వార్తలు వస్తున్నాయి. వీరికి చెల్లింపులు పూర్తయిన తర్వాత ఓటర్ల దగ్గరకు ఎలాగూ వెళ్లాల్సి ఉంటుంది. నియోజకవర్గ పరిధిలో జరుగుతున్న ఖర్చు చూస్తున్న సీనియర్ రాజకీయవేత్తలు సైతం ముక్కున వేలేసుకుంటున్నారు.

దేశంలోనే ఖరీదైన ఉప ఎన్నిక?
మునుగోడు పరిధిలో ఏ ఒక్క హోటల్ లో కూడా గది దొరకడంలేదు. నాయకులంతా ఇక్కడే తిష్టవేయడంతో హోటల్స్ కు మంచి డిమాండ్ ఏర్పడింది. రాష్ట్ర రాజకీయమంతా మునుగోడుకు మారింది. వాస్తవానికి అసెంబ్లీ నియోజకవర్గానికి అభ్యర్థి ఖర్చు రూ.40 లక్షలకు మించకూడదు. కానీ ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే రూ.40 లక్షలనేది చాలా చిన్నమొత్తంగా మారిపోయింది. అంచనా వేయడానికి వీల్లేరి రీతిలో, ఊహించని రీతిలో జరుగుతున్న ఖర్చు చూసి
దేశంలో అత్యంత ఖరీదైన ఉప ఎన్నికగా మారినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. డబ్బులు భారీగా ఖర్చుపెట్టినవారు గెలుస్తారా? లేదంటే ప్రజలు ఎవరిని కోరుకుంటే వారినే గెలిపిస్తారా? అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ప్రస్తుతానికి మాత్రం పచ్చనోటుదే పైచేయిగా మారింది.












Click it and Unblock the Notifications