నంద్యాలపై బాబు కొత్త ట్విస్ట్: శిల్పా యూ టర్న్, అఖిలప్రియ మెట్టు దిగారా?
నంద్యాల ఉప ఎన్నిక అభ్యర్థిపై తెలుగుదేశం పార్టీ శనివారం ఏ నిర్ణయమూ తీసుకోలేదు. ఓ వైపు అఖిల ప్రియ పట్టు, మరోవైపు శిల్పా మోహన్ రెడ్డి బెట్టు చేస్తున్నారు.
అమరావతి/కర్నూలు: నంద్యాల ఉప ఎన్నిక అభ్యర్థిపై తెలుగుదేశం పార్టీ శనివారం ఏ నిర్ణయమూ తీసుకోలేదు. ఓ వైపు అఖిల ప్రియ పట్టు, మరోవైపు శిల్పా మోహన్ రెడ్డి బెట్టు చేయడంతో పార్టీ అధినేత నారా చంద్రబాబుకు పెద్ద తలనొప్పిగా మారింది.
నంద్యాలపై బాబు ట్విస్ట్: 'డబుల్' హామీపై శిల్ప డైలమా? అక్కడే అఖిలతో చిక్కు
శనివారం కళా వెంకట్రావు, సుజనా చౌదరిలతో భేటీ అనంతరం భూమా, శిల్పా వర్గాలు చంద్రబాబుతో భేటీ అయ్యాయి. టిక్కెట్ కోసం ఇరువర్గాలు పట్టుబట్టాయి. దీంతో నోటిఫికేషన్ వచ్చాక అభ్యర్థి ఎంపికపై నిర్ణయం తీసుకోవాలని చంద్రబాబు నిర్ణయించారని తెలుస్తోంది.
అయితే, అంతకుముందే ఈ రోజు (ఆదివారం) భేటీ అయి మరోసారి చర్చించనున్నారు. ఉప ఎన్నిక వ్యవహారం కొలిక్కి వస్తే ఫరవాలేదు. లేదంటే నోటిఫికేషన్ వచ్చాక నిర్ణయం తీసుకోనున్నారు.
చంద్రబాబుతో శిల్పా సోదరులు మరోసారి భేటీ
ఏపీ సీఎం, టిడిపి అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుతో శిల్పా సోదరులు త్వరలో మరోసారి భేటీ కానున్నారు. కొద్ది రోజుల క్రితం అధినేతతో వారు భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ సమయంలో శిల్పా మోహన్ రెడ్డి తన ఆవేదనను వెళ్లబోసుకున్నారు. భూమా ఫ్యామిలీకే టిక్కెట్ ఇవ్వాలని భావించిన చంద్రబాబు తన వైపుకు మొగ్గు చూపేలా కన్విన్స్ చేశారు.
అదే బాబు డైలమాకు కారణం
దాని ఫలితమే ఇప్పుడు చంద్రబాబు డైలమాలో పడటానికి కారణం అయింది. భూమా మృతి చెందడంతో నంద్యాల టిక్కెట్ను అఖిల ప్రియ సూచించిన వ్యక్తికి లేదా భూమా కుటుంబానికి ఇవ్వాలని తొలుత చంద్రబాబు నిర్ణయించారు.
కానీ శిల్పా మోహన్ రెడ్డి కలిసి.. తన రాజకీయ భవిష్యత్తు దీంతో ముడివడి ఉందని, తనకు టిక్కెట్ ఇవ్వకుంటే వైసిపిలోకి వెళ్తానని కొద్ది రోజుల క్రితం చంద్రబాబుకు చెప్పారు. దీంతో చంద్రబాబు పునరాలచలో పడుతున్నారు.
భూమా, శిల్పాల వాదన ఇదీ.. కొలిక్కి రాని వ్యవహారం
భూమా, శిల్పా కుటుంబాలు రెండూ టిక్కెట్ తమకే కావాలన్న పట్టు వీడటం లేదు. గత ఎన్నికల్లో తాము పోటీ చేసిన సీటు కాబట్టి తమకే టిక్కెట్ ఇవ్వాలని శిల్పా వర్గం కోరుతుండగా, అది తమ సిట్టింగ్ స్థానం కాబట్టి తమకే హక్కుంటుందని భూమా వర్గం పట్టుపడుతోంది. వీరి మధ్య సయోధ్యకు, టిక్కెట్ వ్యవహారంపై ఏకాభిప్రాయ సాధనకు పార్టీ నాయకత్వం శనివారం చేసిన ప్రయత్నాలు కొలిక్కి రాలేదు.
అంతకుముందు..
అంతకుముందు, భూమా, శిల్పా వర్గాల నాయకులతో టిడిపి రాష్ట్ర అధ్యక్షులు కళా వెంకట్రావు తదితరులు చర్చలు జరిపారు. కేంద్రమంత్రి సుజనా చౌదరి కూడా రంగంలోకి దిగారు.
చంద్రబాబుతో విడివిడిగా..
అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం రాత్రి ఇరు పక్షాలకు చెందిన వారితో విడివిడిగా మాట్లాడారు. అక్కడా ఎవరి వాదన వారు వినిపించడంతో, ఆదివారం మరోసారి సమావేశమవుతామని చెప్పి పంపించారు.
మంత్రి భూమా అఖిలప్రియ, ఆమె మేనమామ, ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి తదితరులతోను, శిల్పా మోహన్ రెడ్డి, ఆయన సోదరుడు చక్రపాణి రెడ్డిలతోను శనివారం మధ్యాహ్నం గుంటూరు టిడిపి రాష్ట్ర కార్యాలయంలో కళావెంకట్రావు, కేంద్ర మంత్రి సుజనాచౌదరి, మంత్రి పి.నారాయణ విడివిడిగా సమావేశమయ్యారు. వీరు రెండు వర్గాలకు నచ్చజెప్పే ప్రయత్నించారు. ముఖ్యమంత్రి రెండు వర్గాల నాయకులతో వేర్వేరుగా మాట్లాడారు.
అమెరికా పర్యటన తర్వాత..
నంద్యాల ఉప ఎన్నిక అభ్యర్థి అంశం ఈ రోజు (ఆదివారం) కొలిక్కి రాకుంటే టిడిపి అధినేత చంద్రబాబు తన అమెరికా పర్యటన అనంతరం దృష్టి సారించనున్నారు. ఈ రోజు మరోసారి శిల్పా వర్గం ఆయనతో భేటీ కానున్నారు. మొత్తంగా చూస్తే అఖిలప్రియ కొంత తగ్గినట్లుగా కనిపిస్తోందని అంటున్నారు.
బాబు యూటర్న్.. అక్కడే ట్విస్ట్
ఇక్కడ ఓ ట్విస్ట్ ఉంది. ఇటు అఖిలప్రియ, అటు శిల్పా మోహన్ రెడ్డి కూడా భారాన్ని చంద్రబాబుపై వేశారు. ఇరువర్గాలు తమ వాదన వినిపించాయి. చివరగా మాత్రం.. చంద్రబాబుకే అభ్యర్థి ఎంపికను వదిలేశామని చెబుతున్నారు. తనకు టిక్కెట్ ఇవ్వకుంటే పార్టీని వీడుతానని హెచ్చరించిన శిల్పా మోహన్ రెడ్డి.. అధినేతకే అభ్యర్థి ఎంపిక నిర్ణయాన్ని వదిలేసినట్లు చెప్పడం గమనార్హం.
తొలుత భూమా కుటుంబానికి టిక్కెట్ ఇవ్వాలనుకున్న చంద్రబాబు.. శిల్పా వాదనతో కన్విన్స్ కావడం వల్లే ఇంత సస్పెన్స్ కొనసాగుతోందంటున్నారు. చంద్రబాబు నుంచి హామీ రాకుంటే ఆయన ఇప్పటికే పార్టీని వీడేవారని చెబుతున్నారు. శనివారం శిల్పా మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. తాను పార్టీ మారనని తేల్చి చెప్పారు. బాబు నుంచి హామీ వచ్చినందు వల్లే అలా మాట్లాడారని అంటున్నారు.
అఖిలప్రియ టిక్కెట్ కోసం గట్టిగానే పట్టుబడుతున్నారు. అయితే, శిల్పా చెప్పిన దాంతో చంద్రబాబు కన్విన్స్ కావడం వల్ల.. ఇప్పుడు జరుగుతున్నదంతా అఖిలప్రియను, భూమా వర్గాన్ని బుజ్జగించేందుకేననే వాదనలు వినిపిస్తున్నాయి. అదే సమయంలో, నిర్ణయాన్ని చంద్రబాబుకే వదిలేశామని చెప్పడం ద్వారా అఖిలప్రియ ఓ మెట్టు దిగారా అనే చర్చ సాగుతోంది.