రిస్ట్ వాచ్ను సెల్ ఫోన్గా ఉపయోగించి హైటెక్ కాపీయింగ్: డిబారైన విద్యార్ధి
హైదరాబాద్: సెల్ఫోన్తో హైటెక్ కాపీయింగ్కు పాల్పడుతున్న ఓ విద్యార్ధిని పరీక్ష హాల్లోని ఇన్విజిలేటర్ పట్టుకున్న సంఘటన అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. జిల్లాలోని ఓడిచెరువు మండలం గౌనిపల్లికి
చెందిన ఇలియాజ్ అనే విద్యార్థి కదిరి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో గురువారం మొదటి సంవత్సరం పరీక్షకు హాజరయ్యాడు.
ఈ పరీక్షలో అతడు హైటెక్ పద్ధతిలో కాపీ కొడుతుండగా ఇన్విజిలేటర్ శ్రావణ్ కనిపెట్టి పట్టుకున్నాడు. పరీక్ష సమయంలో విద్యార్థి తన ఎడమ చేతికి పెట్టుకున్న రిస్ట్ వాచ్ వైపు పదే పదే చూస్తూ పరీక్ష రాస్తుండటంతో గమనించిన ఇన్విజిలేటర్ శ్రావణ్ అనుమానంతో దాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశాడు.

ఆ రిస్ట్ వాచ్లో సెల్ ఫోన్ మాదిరి రూపొందించి ఉందని, అందులో మేసేజ్ రూపంలో 20 ప్రశ్నలకు సమాధానాలు ముందుగానే రాసుకొచ్చాడు. వెంటనే అతడిని ఇన్విజిలేటర్ శ్రావణ్ కళాశాల ప్రిన్సిపాల్ లక్ష్మిరెడ్డి దగ్గరకు తీసుకెళ్లాడు. ఇలియాజ్ తాను హైటెక్ పద్ధతిలో కాపీ కొడుతున్న విషయాన్ని ప్రిన్సిపాల్ ముందు ఒప్పకున్నాడు.
తన ఇంటి దగ్గరే సెల్ఫోన్లో 20 ప్రశ్నలకు గాను సమాధానాలన్నీ ఫీడ్ చేసి, చేతి గడియారం రూపంలో ఉన్న ఈ సెల్కు పంపించానని, రిస్ట్ వాచ్లోంచి ఒక మెసేజ్ను డిలీట్ చేయగానే, అందులోకి మరో మెసేజ్ వచ్చి చేరుతుందని అతను ప్రాక్టికల్గా వారికి చూపించడంతో ఆ విద్యార్థిని ప్రిన్సిపాల్ డిబార్ చేశారు.












Click it and Unblock the Notifications