పెద్ద మనసుతో: పొన్నాల, రేగా కోసం రేణుకా చౌదరి
హైదరాబాద్: సిపిఐకి కేటాయించిన స్థానాల్లో నామినేషన్లు వేసిన తమ పార్టీ నాయకులు తప్పుకోవాలని తెలంగాణ పిసిసి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య విజ్ఞప్తి చేశారు. పెద్ద మనసుతో సిపిఐకి కేటాయించిన స్థానాల్లో నామినేషన్లు వేసిన తమ పార్టీ నాయకులు వాటిని ఉపసంహరించుకోవాలని ఆయన కోరారు. సిపిఐ కార్యదర్శి కె. నారాయణతో కలిసి ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.
పొత్తుల వల్ల కొందరికి టికెట్లు రాకపోవచ్చునని, సర్దుకుపోవాలని ఆయన అన్నారు. కొంత మందికి అధిష్టానం నిర్ణయం మేరకే బీ ఫారాలు ఇచ్చామని, బీ ఫారాలు తీసుకుని సిపిఐకి కేటాయించిన స్థానాల్లో నామినేషన్ వేసినవారు తప్పుకోవాలని, షరతులతోనే వారికి బీ ఫారాలు ఇచ్చామని ఆయన వివరించారు.
మహేశ్వరంలో బీ ఫారం తీసుకుని నామినేషన్ వేసిన మల్ రెడ్డి రంగారెడ్డిని పోటీ నుంచి విరమింపజేస్తామని ఆయన అన్నారు. సిపిఐతో పొత్తు శుభపరిణామమని ఆయన అన్నారు. రెండు పార్టీలు కూడా ప్రయోజనం పొందుతాయని ఆయన అన్నారు. ఉద్యమంలో భాగమైన అందరితో కలిసి వెళ్లాలని అనుకున్నామని ఆయన చెప్పారు.
కాంగ్రెసు, తెలంగాణ రాష్ట్ర సమితి, తమ పార్టీ కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తే ఫలితాలు ఏకపక్షంగా ఉండేవని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. నారాయణ అన్నారు. కాంగ్రెసు అంటరాని పార్టీ ఏమీ కాదని ఆయన అన్నారు. కెసిఆర్ పొత్తు విషయంలో ఆత్మవంచనతో కూడిన ప్రకటనలు చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. పొత్తుల వల్ల అసంతృప్తులు ఉంటాయి గానీ కలిసి పనిచేయాలని ఆయన అన్నారు. ప్రభుత్వంలో చేరే విషయంపై ఎన్నికల తర్వాత నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు.
ఖమ్మం జిల్లా పినపాక సిట్టింగ్ సీటు సిపిఐకి ఇవ్వడం బాధాకరమని, రేగా కాంతారావుకు ఇవ్వాల్సిందని కాంగ్రెస్ నేత రేణుకాచౌదరి అభిప్రాయపడ్డారు. శుక్రవారం ఉదయం కేంద్రమంత్రి జైరాంరమేష్,కొ ప్పుల రాజుతో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడారు.
రేగా కాంతారావు వివాదరహితుడని ఆమె అన్నారు. ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన రేగ కాంతారవు రేపు(శనివారం) నామినేషన్ను ఉపసంహరించుకునే అవకాశం ఉందని తెలిపారు. మహిళలకు మోడీ రక్షణ కల్పిస్తాడన్న నమ్మకం లేదని రేణుకాచౌదరి వ్యాఖ్యానించారు.