స్వైన్ ప్లూ: చికిత్స పొందుతూ నిండు గర్భిణీ మృతి
కర్నూలు: స్వైన్ ప్లూకి నిండు గర్భిణీ బలైంది. ఈ సంఘటన కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని హాలహర్వి మండల పరిధిలోని సిరగాపురం గ్రామంలో శుక్రవారం స్వైన్ ఫ్లూతో చికిత్స పొందుతూ నిండు గర్భిణీ పల్లవి(22) మృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు.
మూడు రోజుల క్రితం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో పల్లవికి వైద్యపరీక్షలు నిర్వహించిన వైద్యులు స్వైన్ ఫ్లూ ఉన్నట్లు నిర్ధారించారు. ఇక తెలంగాణలో స్వైన్ ఫ్లూ వ్యాధితో మృతి చెందిన వారి సంఖ్య 60కి చేరిందని వైద్యారోగ్యశాఖ గురువారం ఓ ప్రకటనలో తెలిపింది.
బుధవారం వరకు 5240మంది అనుమానితులకు పరీక్షలు నిర్వహించగా, 1651మందికి స్వైన్ఫ్లూ పాజిటివ్ ఉన్నట్లు తేలింది. ఇప్పటి వరకు 60మంది దీంతో మృతి చెందినట్లు తెలిపారు. బుధవారం 126మంది అనుమానితులకు పరీక్షలు నిర్వహించగా.. 51మందికి పాజిటివ్ ఉన్నట్లు నివేదికలు వచ్చాయని బులెటిన్లో పేర్కొంది.

దేశ వ్యాప్తంగా 1239కు చేరిన స్వైన్ ఫ్లూ మృతులు:
స్వైన్ఫ్లూ వ్యాధి వల్ల మరో 41 మంది మృతి చెందారు. దీంతో దేశవ్యాప్తంగా మరణించిన వారి సంఖ్య 1239 మందికి చేరుకోగా, బాధితుల సంఖ్య 23,153 మందికి చేరిందని గురువారం కేంద్ర ఆరోగ్యశాఖ ఓ ప్రకటనలో తెలిపింది.
బుధవారం నాటికి ప్రధాని నరేంద్ర మోడీ సొంతరాష్ట్రం గుజరాత్లో అత్యధికంగా 302 మంది మరణించగా, 5065 మంది చికిత్స పొందుతున్నారు. రాజస్థాన్లో మరో తొమ్మిది మంది మృతి చెందడంతో మొత్తం మరణించిన వారి సంఖ్య 295 మందికి చేరింది. మధ్యప్రదేశ్లో 174 మంది, మహారాష్ట్రలో 178 మరణించారు.












Click it and Unblock the Notifications