లక్ష మందికి ముత్యాల తలంబ్రాలు, కంకణం: ప్యాకింగ్ ప్రారంభించిన టీటీడీ
Vontimitta: ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. శనివారం నాడు 78,496 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 30,046 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 3.60 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది.
29 కంపార్ట్మెంట్లల్లో
వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో 29 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 నుంచి 14 గంటల సమయం పట్టింది. కంపార్ట్మెంట్లు, క్యూ లైన్లల్లో ఉన్న వారికి టీటీడీ సిబ్బంది అన్నప్రసాదం, మజ్జిగ, మంచినీరు, అల్పాహారాన్ని పంపిణీ చేశారు.

బ్రహ్మోత్సవాలు ఆరంభం..
కాగా- శ్రీరామనవమిని పురస్కరించుకుని కడప జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి ఆలయం బ్రహ్మోత్సవాలు వైభవంగా ఆరంభం అయ్యాయి. నేటి నుండి 14వ తేదీ వరకు శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలను టీటీడీ అధికారులు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి.ఒకే శిలపై..
ఏకశిలపై..
ఈ ఆలయానికి పురాతన, చారిత్రక ప్రాశస్త్యం ఉంది. ఒకే శిలపై సీతారామ లక్ష్మణ దేవతామూర్తులు ఉండడం వల్ల ఒంటిమిట్టను ఏకశిలానగరంగా పిలుస్తారు. శనివారం రాత్రి శాస్త్రోక్తంగా అంకురార్పణ చేశారు. ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి, పరివార దేవతలకు తిరుమంజనం నిర్వహించారు.
వ్యాసాభిషేకం, ఆరాధనతో..
అనంతరం మూలవర్లకు వ్యాసాభిషేకం, ఆరాధన, అర్చన చేశారు. సాయంత్రం 6 నుండి అర్చకుల వేదమంత్రాల నడుమ శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించారు. ఇందులో భాగంగా శ్రీ సీతారామ లక్ష్మణ ఉత్సవమూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించి ప్రత్యేక వేదికపై కొలువుదీర్చి విష్వక్సేన పూజ, కలశం ప్రతిష్ట, కలశపూజ, వాసుదేవ పుణ్యాహవచనం, కంకణధారణ చేశారు.

పాంచరాత్ర ఆగమశాస్త్రబద్ధం..
ఈ ఉదయం 9:30 నుండి 10:15 నిమిషాల మధ్య వృషభలగ్నంలో పాంచరాత్ర ఆగమశాస్త్ర బద్ధంగా గరుడపటాన్ని ప్రతిష్ఠించారు అర్చకులు. ముందుగా గరుడ ధ్వజపటాన్ని ఊరేగింపుగా తీసుకొచ్చి గరుడ ప్రతిష్ట, ప్రాణప్రతిష్ట, నేత్రోల్మీలనం నిర్వహించారు. ధ్వజస్తంభానికి నవకలశ పంచామృతాభిషేకం చేశారు.
అష్టదిక్పాలకులకు ఆహ్వానం..
రాగతాళ నివేదన ద్వారా ఇంద్రాది సకలదేవతలను, నవగ్రహాలను, అష్టదిక్పాలకులను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించారు. ఈ సందర్భంగా వేదపండితులు చతుర్వేద పారాయణం చేశారు. కంకణబట్టర్ రాజేష్ కుమార్ ఆధ్వర్యంలో బ్రహ్మోత్సవాల ధ్వజారోహణ కార్యక్రమాన్ని నిర్వహించారు.
వేణుగాణ అలంకారం..
సాయంత్రం 7 నుండి రాత్రి 9 గంటల వరకు శేష వాహనంపై స్వామివారిని ఊరేగిస్తారు. 7వ తేదీన ఉదయం వేణుగాణ అలంకారంలో కటాక్షిస్తాడు. రాత్రి- హంస వాహన సేవ ఉంటుంది. 8న ఉదయం వటపత్రశాయి అలంకారం, రాత్రి సింహ వాహనం, 9న ఉదయం నవనీత కృష్ణాలంకారం, రాత్రి హనుమంత వాహనంపై స్వామివారు ఊరేగుతారు.
శివధనుర్బాణ అలంకరణ..
10వ తేదీన ఉదయం మోహినీ అలంకారంలో దర్శనం ఇస్తాడు. రాత్రి గరుడసేవ ఉంటుంది. 11వ తేదీన ఉదయం శివధనుర్బాణ అలంకరణ, రాత్రి- కళ్యాణోత్సవాన్ని నిర్వహిస్తారు. 12వ తేదీన ఉదయం కన్నులపండువగా రథోత్సవం. 13న ఉదయం కాళీయమర్ధన అలంకారం, రాత్రి అశ్వవాహనంపై సీతాసమేత కోదండరాముడు భక్తులను కరుణిస్తాడు.
చక్రస్నానంతో..
14వ తేదీన ఉదయం చక్రస్నానంతో ఈ బ్రహ్మోత్సవం ముగుస్తుంది. రాత్రి ధ్వజావరోహణాన్ని నిర్వహిస్తారు. 15వ తేదీ సాయంత్రం 6 నుండి రాత్రి 9 గంటల వరకు పుష్పయాగం నిర్వహించనున్నారు అర్చకులు.
పట్టువస్త్రాలను సమర్పించనున్న చంద్రబాబు..
బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఈ నెల 11వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రీ సీతారాముల వారికి పట్టువస్త్రాలను సమర్పించనున్నారు. కడప ఎయిర్ పోర్ట్ నుండి నేరుగా ఒంటిమిట్ట ఆలయానికి చేరుకుంటారు చంద్రబాబు. కల్యాణోత్సవంలో పాల్గొంటారు.
మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి..
ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీతారాముల వారికి పట్టువస్త్రాలను సమర్పిస్తారు. ప్రత్యేక పూజల్లో పాల్గొంటారు. దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు సహా కొందరు మంత్రులు, ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.
తలంబ్రాల తయారీ..
కాగా- 11వ తేదీన జరుగనున్న శ్రీ సీతారాముల కల్యాణం కోసం ఆలయంలో తలంబ్రాల తయారీ శాస్త్రోక్తంగా ప్రారంభమైంది. ముత్యాల తలంబ్రాల ప్యాకింగ్ కార్యక్రమాన్ని వేదమంత్రోఛ్ఛారణల మధ్య శ్రీవారి సేవకులతో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు లాంఛనంగా ప్రారంభించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఊరేగింపుగా కల్యాణవేదిక వద్ద గల పీఏసీ వద్దకు తీసుకొచ్చారు.
ముత్యం, కంకణం..
ఇక్కడి హాలులో బియ్యం, పసుపు, నెయ్యి కలిపి తలంబ్రాలు తయారు చేసి, తలంబ్రాలతో పాటు ముత్యం, కంకణం ఉంచి ప్యాకెట్లను సిద్ధం చేస్తున్నారు. కడప, అన్నమయ్య రాయచోటి జిల్లాల నుండి శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల్లో సేవలందించడానికి శ్రీవారి సేవకులు వచ్చారు. దాదాపు 425 మంది శ్రీవారి సేవకులు లక్షకుపైగా తలంబ్రాల ప్యాకెట్ల తయారీలో పాల్గొంటోన్నారు.

స్నపన తిరుమంజనం..
అటు తిరుమల శ్రీవారి ఆలయంలో నేడు శ్రీరామనవమి ఆస్థానాన్ని పురస్కరించుకొని శ్రీసీతారామ లక్ష్మణ సమేత హనుమంతులవారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజన కార్యక్రమాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. రంగనాయకుల మండపంలో ఉదయం 9 నుండి 11 గంటల వరకు శ్రీ సీతారామ లక్ష్మణ సమేత హనుమంతులవారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనాన్ని పూర్తి చేశారు.
పాశురాల పఠనం..
ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్ళు, పసుపు, చందనంతో ఉత్సవర్లను అభిషేకం చేశారు. ఈ సందర్భంగా తైత్తరీయ ఉపనిషత్తు, పురుషసూక్తం, శ్రీసూక్తం, భూసూక్తం, నీలాసూక్తం, పంచశాంతి మంత్రాలు, దివ్యప్రభందంలోని అభిషేక సమయంలో అనుసంధానం చేసే పాశురాలను వేదపండితులు పఠించారు.
శ్రీరామ పట్టాభిషేక ఆస్థానం..
శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా ఈ సాయంత్రం 6:30 నుండి 8 గంటల వరకు హనుమంత వాహన సేవ జరుగనుంది. ఆ తరువాత రాత్రి 9 నుండి 10 గంటల నడుమ బంగారు వాకిలి చెంత శ్రీరామనవమి ఆస్థానాన్ని వేడుకగా నిర్వహిస్తారు. 7వ తేదీన రాత్రి 8 నుండి 9 గంటల మధ్య బంగారు వాకిలి చెంత ఆలయ అర్చకులు శ్రీరామ పట్టాభిషేక ఆస్థానాన్ని నిర్వహించనున్నారు.
-
Dry Day: మందు బాబులకు షాక్.. వాహనదారులకు అలర్ట్! -
రాములవారి సేవలో శ్రీవారి సేవకులు, అరుదైన ఘట్టం - కన్నుల పండువగా..!! -
రూ.300 టికెట్లు లేకపోయినా శ్రీవారి దర్శనం- భక్తుల కోసం టీటీడీ కొత్త విధానం...!! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications