అమరావతికి రాష్ట్రపతి : పౌర సన్మానం - సీఎం జగన్ విందు..!!
రాష్ట్రపతి హోదాలో ద్రౌపది ముర్ము తొలి సారి ఏపీకి వస్తున్నారు. రెండు రోజులు ఏపీలో పర్యటించనున్నారు. విజయవాడ - విశాఖల్లో రాష్ట్రపతి పర్యటన ఖరారైంది. డిసెంబర్ 4,5 తేదీల్లో పర్యటన షెడ్యూల్ ఫైనల్ అయింది. 4వ తేదీన అమరావతి - విజయవాడలో జరిగే కార్యక్రమాలు పాల్గొని విశాఖ చేరుకుంటారు. అక్కడే ఆ రోజు బస చేసి 5వ తేదీన విశాఖ కేంద్రంగా జరిగే కార్యక్రమాలకు హాజరవుతారు. పలు అభివృద్ధి కార్యక్రమాలను రాష్ట్రపతి ప్రారంభించనున్నారు. ఏపీకి రానున్న ముర్ముకు రాష్ట్ర ప్రభుత్వం పౌర సన్మానం ఏర్పాటు చేసింది. రాజ్ భవన్ లో గవర్నర్ విందు ఇవ్వనున్నారు.
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము డిసెంబర్ 4,5 తేదీల్లో ఏపీలో పర్యటన ఖరారైంది. డిసెంబర్ 4న ఉదయం రాష్ట్రపతి విజయవాడ చేరుకుంటారు. రాష్ట్రపతికి గవర్నర్ బిశ్వభూషణ్..సీఎం జగన్ స్వాగతం పలకనున్నారు. రాష్ట్రపతి హోదాలో తొలి సారి ఏపీకి వస్తున్న వేళ..ప్రభుత్వం పౌర సన్మానం ఏర్పాటు చేసింది. పలు అభివృద్ధి కార్యక్రమాలను రాష్ట్రపతి ప్రారంభించనున్నారు.
రాయచోటి - అంగల్లె సెక్షన్ జాతీయ రహదారిని, జాతీయ రహదారి -205పై నాలుగు లేన్ల ఆర్వోబీ-అప్రోచ్ రోడ్లను ,కర్నూలులోని ఐటీసీ జంక్షన్ వద్ద నిర్మించిన ఆరు లేన్ల గ్రేడ్ సపరేటెడ్ నిర్మాణాలను రాష్ట్రపతి ప్రారంభిస్తారు. మదిగుబ్బ- పుట్టపర్తి రహదారి విస్తరణ పనులకు భూమి పూజ చేస్తారు. విజయవాడ నుంచి వర్చ్యువల్ గా జరిగే ఈ కార్యక్రమాల్లో గవర్నర్ - సీఎం జగన్ హాజరవుతారు.
ఆ వెంటనే రాజ్ భవన్ లో రాష్ట్రపతి గౌరవార్దం గవర్నర్ విందు ఇవ్వనున్నారు. ఈ విందుకు సీఎంతో పాటుగా హైకోర్టు న్యాయమూర్తులు..రాజకీయ -అధికార ప్రముఖులను ఆహ్వానించనున్నారు. తరువాత విశాఖ పర్యటనకు వెళ్లనున్నారు. విశాఖ బీచ్ రోడ్డులో నిర్వహించే భరత నౌకాదళ విన్యాసాలను వీక్షిస్తారు. ఆ రోజున విశాఖలోనే బస చేయనున్న రాష్ట్రపతి 5వ తేదీన విశాఖ నుంచి ఢిల్లీ వెళ్తారు.
రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు కోసం ఏపీకి వచ్చిన సమయంలో సీఎం జగన్ తన నివాసంలో తేనేటి విందు ఇచ్చారు. ఆ తరువాత వైసీపీ ఎంపీలు - ఎమ్మెల్యేల సమావేశంలో పాల్గొన్నారు. అదే సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ప్రత్యేకంగా ముర్ముతో సమావేశమయ్యారు. ఇక, ఇప్పుడు రాష్ట్రపతి హోదాలో ఏపీకి వస్తున్న సమయంలో ఏపీ ప్రభుత్వం పూర్తి స్థాయి ఏర్పాట్లు చేస్తోంది.