మూడేళ్లు ముగిసింది - 2024 కోసం సీఎం జగన్ కొత్త వ్యూహాలు : సంక్షేమం - సామాజిక న్యాయం అస్త్రాలుగా..!!
జగన్ అనే నేను...అంటూ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి నేటికి మూడేళ్లు పూర్తయింది. 3,648 కిలో మీటర్ల పాదయాత్ర ద్వారా ప్రతీ గ్రామాం.. ప్రతీ వర్గం ప్రజల్లో తన పైన నమ్మకం కల్పించి.. 40 ఇయర్స్ ఇండస్ట్రీని రాజకీయంగా దారుణంగా దెబ్బ కొట్టి 51 శాతం ఓటింగ్ తో.. 151 సీట్లతో ఏపీ ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణ స్వీకారం చేసి మూడేళ్లు.
ఈ మూడేళ్ల పాలనలో ఎన్నో ఒడిదుడుకులు. కానీ, మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతీ హామీ అమలు దిశగానే సీఎం జగన్ అడుగులు వేసారు. ఇప్పటికే ఇచ్చిన హామీల్లో 90 శాతం మేర పూర్తి చేసామని పార్టీ నేతలు చెబుతున్నారు. మూడేళ్ల పాలన పూర్తయిన వేళ..పార్టీ నేతలు సంబరాలకు సిద్దమయ్యారు.

సీఎం జగన్ సమర్ధతకు పరీక్షగా
ఈ మూడేళ్ల కాలంలో కరోనా సంక్షోభం తొలి సారి సీఎం అయిన జగన్ సమర్ధతకు పరీక్షగా నిలిచింది. కానీ, ఆ పరీక్షలో జగన్ ప్రభుత్వం మంచి ఫలితాలు సాధించింది. వ్యాక్సినేషన్ లో ప్రధాని అభినందనలు అందుకుంది. ఆర్దికంగా రాష్ట్రం కరోనా దెబ్బకు చితికిపోయింది. కానీ, సంక్షేమ పథకాలు మాత్రం ఆగలేదు. తనకు ఎన్ని కష్టాలు ఉన్నా..సమస్యలు ఎదురైనా ఇచ్చిన మాట కోసం ప్రతీ ఒక్క పథకానికి తేదీ ముందుగానే చెప్పి మరీ జగన్ అమలు చేస్తూ వచ్చారు.
ఇక, ఇప్పుడు 2024 ఎన్నికల్లో తిరిగి అధికారమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. తన మూడేళ్ల పాలనలో అందించిన సంక్షేమం.. అమలు చేసిన సామాజిక న్యాయం అస్త్రాలుగా వచ్చే ఎన్నికలకు సిద్దం అవుతూనే.. మరో రెండేళ్ల పాలనలో మరింత సమర్ధవంతంగా పూర్తి చేసేందుకు సిద్దం అవుతున్నారు. ఈ మూడేళ్ల కాలంలో స్థానిక సంస్థలు - మున్సిపల్ ఎన్నికల్లో ఏకపక్ష విజయం సీఎం జగన్ నాయకత్వానికి భారీ గిఫ్ట్.

సచివాయాలు - కొత్త జిల్లాల ఏర్పాటు
ఇక, కొత్త జిల్లాల ఏర్పాటు.. మంత్రివర్గ విస్తరణ.. సచివాలయాల్లో సేవల విస్తరణ.. నాడు - నేడు.. సంక్షేమ పథకాల అమలు విషయంలో సక్సెస్ అయ్యారు. సామాజిక న్యాయం - మహిళలకు ప్రాధాన్యతలో అందునా బీసీ -ఎస్సీ-ఎస్టీ- మైనార్టీ వర్గాలకు ఇస్తున్న ప్రాధాన్యత ఏపీ రాజకీయాల్లో కొత్త చరిత్రకు కారణమైంది. ఇదే సమయంలో అభివృద్ధి విస్మరిస్తున్నారనేది ప్రధాన విమర్శగా మిగిలింది.
దీంతో పాటుగా.. రాష్ట్రంలో పెట్టుబడులు - పరిశ్రమలు- ఉపాధి కల్పన.. ప్రభుత్వ జాబ్ క్యాలెండర్ వంటి ప్రతిపక్షాల విమర్శలకు అవకాశం ఇస్తున్నాయి. ఏపీలో గతంలో ఎన్నడూ లేని విధంగా.. మహిళలకు పదవుల కేటాయింపులో జగన్ చరిత్ర క్రియేట్ చేసారు. రాష్ట్రంలో 13 జిల్లా పరిషత్ ఎన్నికలు జరగ్గా.. వాటిలో 7 జిల్లాల జెడ్పీ పీఠాలను మహిళలకు కేటాయించడం ద్వారా 54 శాతం అవకాశం కల్పించారు. 26 జెడ్పీ వైస్ చైర్మన్లలో 15 మంది మహిళలే. మొత్తంగా 12 మేయర్, 24 డిప్యూటీ మేయర్ కలిపి 36 పదవులు ఉంటే.. వాటిలో 18 పదవులు మహిళలవే. వార్డు మెంబర్లు 671 మందిలో 361 మంది మహిళలే ఉన్నారు. 75 మునిసిపాలిటీల్లో 45 మంది మహిళా చైర్పర్సన్లే ఉన్నారు.

సామాజిక న్యాయంలో కొత్త అడుగులు
ఇక, సామాజిక న్యాయం దిశగా వేసిన అడుగులు ఇప్పుడు..ఆ వర్గాల నుంచి వైసీపీకి అండ లభిస్తోంది. రాష్ట్రంలో 139 బీసీ కులాలకు 56 వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్లను 2020 అక్టోబర్లో ఏర్పాటు చేశారు. ఆయా సామాజిక వర్గాల్లోని పేదలకు అండగా నిలిచి ఇబ్బందులను దూరం చేసేలా.. వారందరికీ ఆర్థిక, సామాజిక బలిమి చేకూరేలా సంబంధిత కార్పొరేషన్లను తీర్చిదిద్దారు.
కార్పొరేషన్లను సామాజిక చైతన్య వేదికలుగా మలిచి రాష్ట్రంలో కొత్త చరిత్రకు సీఎం జగన్ నాంది పలికారు. వాస్తవానికి వెనుకబడిన తరగతుల్లో బయట ప్రపంచానికి పేర్లు సైతం తెలియని కులాలను కూడా గుర్తించారు.అత్యంత వెనుకబడిన, నిర్లక్ష్యానికి గురైన అనేక కులాలకు కూడా ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. ఒక్కో కార్పొరేషన్కు ఒక చైర్మన్, 12 డైరెక్టర్లను నియమించి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు ప్రాధాన్యత ఇవ్వడం ఒక రికార్డు.

స్థానిక సంస్థల్లో ఏకపక్ష విజయంతో
రాష్ట్రంలో 56 కార్పొరేషన్ల చైర్మన్లు, 672 డైరెక్టర్ల పదవుల్లో 50 శాతం పదవులను మహిళలకే కట్టబెట్టి మరో రికార్డును నెలకొల్పారు. ఇక, తన పాలనలో సచివాలయాల ద్వారా పాలనను ప్రజల చెంతకు తీసుకెళ్లే ప్రయత్నంలో కొత్త అడుగులు వేస్తున్న సీఎం జగన్.. పార్లమెంటు నియోజకవర్గాల ప్రాతిపదికగా ప్రభుత్వం 13 జిల్లాలను 26 జిల్లాలుగా పునర్వ్యవస్థీకరించి రాష్ట్రానికి కొత్త రూపు ఇచ్చింది.
51 రెవెన్యూ డివిజన్లను 74కి పెంచి పరిపాలనకు మరింత వెసులుబాటు కల్పించింది. అనూహ్యంగా..ఎన్టీఆర్ జన్మించిన కృష్ణాజిల్లాకు ఆయన పేరు పెడుతూ ప్రధాన ప్రతిపక్ష పార్టీని ఆత్మరక్షణలోకి నెట్టింది. నాడు - నేడు జగన్ మూడేళ్ల పాలనలో ప్రశంసలు అందుకున్న స్కీం. కార్పొరేట్ను తలదన్నేలా సర్కారీ స్కూళ్లు తీర్చి దిద్దుతున్నారు. మనబడి నాడు-నేడుతో మారిన రూపురేఖలు మరిపోతున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో చేరికలు పెరిగాయి.

ఇక అసలు టార్గెట్ 2024 ఎన్నికలే..
రూ.16,450 కోట్లతో 61,661 విద్యా సంస్థల్లో మూడు దశల్లో పనులు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే మొదటి దశ పూర్తి చేసారు. విద్యా వ్యవస్థ - రైతు..మహిళా సంక్షేమతం.. సామాజిక న్యాయం పైన సీఎం జగన్ వ్యక్తిగతంగా ప్రత్యేకంగా శ్రద్ద పెట్టారు. పాలనకు మానవీయతను జోడించి.. సంక్షేమానికి కొత్త అర్దం చెబుతూ..సామాజిక న్యాయం ఆచరణలో చూపిస్తూ.. మూడేళ్ల పాలన పూర్తి చేసిన సీఎం జగన్.. రాజకీయంగానూ ఆధిపత్యం చూపించేందుకు ఇప్పుడు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.
ప్రతిపక్షాలను ధీటుగా ఎదుర్కొని.. తిరిగి అధికారంలోకి వచ్చేందుకు ఇప్పటి నుంచే ప్రణాళికలు అమలు చేస్తున్నారు. దీంతో.. ఇక, ప్రతిపక్షాలు రాజకీయంగా ముందుకు కదులుతున్న వేల.. అటు ప్రభుత్వం..ఇటు పార్టీ పరంగా సీఎం జగన్ వేగంగా నిర్ణయాలు తీసుకోవటంతో పాటుగా..ప్రజల్లోనే ఎక్కువగా ఉండేలా మూడేళ్ల పాలన ముగుస్తున్న వేళ కొత్త నిర్ణయాల దిశగా అడుగులు వేస్తున్నారు.












Click it and Unblock the Notifications