పుంగనూరులో మంత్రి పెద్దిరెడ్డిపై ప్రత్యర్థి ఖరారు?
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుప్పంలో పోటీచేయడం కాదని, పుంగనూరులో తనపై పోటీచేసి గెలవాలని రామచంద్ర యాదవ్ సవాల్ విసిరారు.
తన వినతిని మన్నించి వై ప్లస్ భద్రత కల్పించిన కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు.. పుంగనూరుకు చెందిన పారిశ్రామిక వేత్త రామచంద్ర యాదవ్ కృతజ్ఞతలు తెలియజేశారు. త్వరలోనే తాను పుంగనూరు నియోజకవర్గం అంతా పర్యటిస్తానని, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆగడాలన్నింటినీ ప్రజలకు వివరిస్తానన్నారు. 2024 ఎన్నికల్లో తాను పుంగనూరు నుంచే పోటీ చేస్తున్నానని స్పష్టం చేశారు.
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుప్పంలో పోటీచేయడం కాదని, పుంగనూరులో తనపై పోటీచేసి గెలవాలని సవాల్ విసిరారు. తనను ఇబ్బంది పెట్టిన అధికారులపై సీబీఐకి ఫిర్యాదు చేయబోతున్నట్లు రామచంద్ర వెల్లడించారు. ఈనెల 11వ తేదీన ఢిల్లీలో అమిత్ షాను రామచంద్రయాదవ్ కలిశారు. తన ఇంటిపై దాడిచేయడంతోపాటు హత్యాయత్నం చేశారంటూ కొన్ని ఆధారాలను సమర్పించారు. ప్రాణహాని ఉండటంతో భద్రత కల్పించాలని కోరారు.

కేంద్ర బలగాలతో రక్షణ కల్పిస్తానని అమిత్ షా భరోసా ఇచ్చినట్లు తెలిపారు. ఆయన్ను కలిసి 10 రోజుల్లోనే కేంద్ర హోంశాఖ ద్వారా రామచంద్రకు Y+ కేటగిరి భద్రతను కల్పించారు. సాయుధ బలగాలు పుంగనూరుకు చేరుకొని ఆయన భద్రతను పర్యవేక్షిస్తున్నాయి. అమిత్ షాను కలిసిన 10 రోజుల్లోనే వైప్లస్ సెక్యూరిటీ కల్పించడం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.
2019 ఎన్నికల్లో జనసేన తరఫున పోటీచేసి ఓటమి పాలైన రామచంద్రయాదవ్ ఆ తర్వాత తను తాను సొంతంగా ప్రొజెక్ట్ చేసుకుంటున్నారు. ఏ పార్టీలతో సంబంధం లేకుండా వ్యక్తిగతంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రైతు సమస్యలపై రైతుభేరి నిర్వహించడానికి ఏర్పాట్లు చేయగా దానికి ప్రభుత్వం అనుమతివ్వలేదు. దీంతో రామచంద్రయాదవ్ అనుచరులు ర్యాలీ అంబేద్కర్ విగ్రహం వరకు వెళ్లి పాలాభిషేకం చేశారు. అదేరోజు రాత్రి కొందరు వ్యక్తులు యాదవ్ ఇంటిపై, కార్యాలయంపై దాడిచేయడంతోపాటు ఇంట్లో ఫర్నిచర్ ను, బయట నిలిపివున్న కారు అద్దాలను ధ్వంసం చేశారు. దీనిపై రామచంద్రయాదవ్ అమిత్ షాకు ఫిర్యాదు చేశారు.












Click it and Unblock the Notifications