40 నిముషాల సమయం ఇచ్చిన అమిత్ షా!!
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలవాలంటే అంత ఆషామాషీ కాదు. తీవ్ర ప్రయత్నం చేయాలి.. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా అయివుండాలి.. లేదంటే బీజేపీ పాలిత రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా అయి ఉండాలి.. లేదంటే ఇతర రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్నవారన్నా కావాలి. కానీ అవేమీ లేకుండానే ఒక నియోజకవర్గంలో తన రాజకీయ జీవితానికి పునాది వేసుకుంటున్న సాధారణ అభ్యర్థికి అమిత్ షా 40 నిముషాల సమయం కేటాయించడమంటే మాములు విషయం కాదు.

షాకు పెద్దిరెడ్డిపై ఫిర్యాదు
2019లో పుంగనూరు నుంచి జనసేన అభ్యర్థిగా పోటీచేసి ఓటమిపాలైన రామచంద్రయాదవ్ అమిత్ షాను కలిసి రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దేశంలో నెంబరు 2గా ఉన్న అమిత్ షా యాదవ్ కు అంత సమయం ఇవ్వడం పుంగనూరుతోపాటు ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. రామచంద్రయాదవ్ చేస్తున్న కార్యక్రమాలకు విపరీతమైన ప్రచారం వస్తోంది. అతను ఏ కార్యక్రమం తలపెట్టినా ఒత్తిడి వాతావరణం మధ్యే జరుగుతోంది. నిరుద్యోగ యువతకు జాబ్ మేళా నిర్వహించడం, యోగా గురువు రాందేవ్ బాబాతో గృహ ప్రవేశం లాంటి కార్యక్రమాలతో పాపులర్ అయ్యారు.

ఇంట్లోకి ప్రవేశించి ఫర్నిచర్ ధ్వంసం
గత నెలలో రామచంద్రయాదవ్ పుంగనూరులో రైతు సమస్యలపై రైతుభేరి నిర్వహించాలనుకుంటే అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. అయితే యాదవ్ అనుచరులు ర్యాలీగా వెళ్లి అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. అనంతరం ఎల్ఐసీ కాలనీలోని రామచంద్రయాదవ్ కొత్త ఇంటికి వెళ్లారు. ఆ తర్వాతే పరిణామాలు మారాయి. కొందరు వ్యక్తులు కర్రాలు, రాళ్లతో రాత్రివేళ యాదవ్ ఇంటిపై దాడి చేయడంతోపాటు ఇంట్లోకి ప్రవేశించి ఫర్నీచర్ ధ్వంసం చేశారు. ఇంటి ఆవరణలో ఉన్న కార్ల అద్దాలను పగలకొట్టారు.

ఏపీ బీజేపీ నేతలకు కూడా తెలియదు?
వైసీపీ కార్యకర్తలు ఇంత విధ్వంసానికి దిగినప్పటికీ పోలీసులు పట్టించుకోలేదని రామచంద్ర మండిపడ్డారు. అయితే ఎన్నికల సమయంలో ఓట్ల కోసం ఇచ్చిన టోకెన్ డబ్బులు ఇస్తారంటూ ఫేస్ బుక్ లో ప్రచారం జరగడంతో డబ్బుల కోసం మహిళలు రామచంద్రయాదవ్ ఇంటికి భారీసంఖ్యలో చేరుకున్నారు. మా టోకెన్లకు డబ్బులు ఎప్పుడిస్తారంటూ బోర్డులు, బ్యానర్లు వెలిశాయి. వైసీపీనే తనపై అభాండాలు వేస్తోందని ఆరోపించిన రామచంద్రయాదవ్ అందరికీ షాక్ ఇస్తూ ఢిల్లీలో అమిత్ షాను కలవడం చర్చకు దారితీసింది. గల్లీ గొడవను ఢిల్లీవరకు తీసుకువెళ్లి షాకు ఫిర్యాదు చేయడంపై రాజకీయ వర్గాల్లో ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. ఈ భేటీ గురించి ఏపీకి చెందిన బీజేపీ నేతలెవరికీ తెలియకపోవడం మరో విశేషం.












Click it and Unblock the Notifications