విశాఖ ఎయిర్ పోర్ట్లో పురంధేశ్వరికి ఏయు జెఏసి షాక్
జై సమైక్యాంధ్ర, గో బ్యాక్ పురంధేశ్వరి అంటూ నినాదాలు చేశారు. అప్రమత్తమైన పోలీసులు వెంటనే వారిని అక్కడి నుండి పంపించే ప్రయత్నాలు చేశారు. వారు ఎంతకూ వెళ్లకపోయేసరికి పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకున్నారు. పురంధేశ్వరిని అడ్డుకున్నవారు ఏయు విశ్వవిద్యాలయ ఐక్యకార్యాచరణ సమితికి చెందిన విద్యార్థులు.
కాగా, విభజన అనివార్యమైన పరిస్థితుల్లో సీమాంధ్ర హక్కుల కోసం పోరాడాలని పురంధేశ్వరి చెప్పిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సమైక్యవాదాన్ని బలంగా వినిపిస్తున్నారని, ప్రస్తుత పరిస్థితుల్లో సీమాంధ్ర ప్రాంతం నష్టపోకుండా ఏం చేయాలో ఆలోచించాలని ఆమె అభిప్రాయపడ్డారు. ప్రస్తుత పరిస్థితుల్లో విభజన అనివార్యంగా కనిపిస్తోందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సీమాంధ్ర ప్రాంత హక్కుల కోసం పోరాడాలన్నారు.
తాము సీమాంధ్ర హక్కుల కోసం పోరాడుతుంటే ద్రోహులుగా చిత్రీకరించడం సరికాదన్నారు. తానుండగా విభజన జరగదని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చెప్పడం అది ఆయన అభిప్రాయమన్నారు. కేంద్రం తెలంగాణపై ముందుకు వెళ్తున్న తరుణంలో సీమాంధ్ర ప్రాంతం నష్టపోకుండా ఏం చేయాలో ఆలోచించాలన్నారు. నీటి సమస్యలు, విద్యావకాశాల విషయంలో ప్రజలకు భయాందోళనలు ఉన్నాయని చెప్పారు.
తాము అధిష్టానం తీరు వల్లనే రాజీనామా చేశామని చెప్పారు. విభజనపై ఇంత జరుగుతున్న ప్రజలను మభ్యపెట్టడం సరికాదన్నారు. తాను సమైక్యవాదినని అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో సీమాంధ్ర హక్కుల కోసం పోరాడాల్సి ఉందన్నారు. రాజీనామాలపై మిగిలిన ఎంపిల నిర్ణయం వారి వ్యక్తిగతమన్నారు. విభజన విషయంలో సిపిఎం, మజ్లిస్ మినహా అన్ని పార్టీలు ముద్దాయిలే అన్నారు.