నన్ను బాధించింది: కాంగ్రెస్పై పురంధేశ్వరి, పార్టీ చేరికపై
తాను పార్టీని ఎందుకు వీడానో కార్యకర్తలకు వివరించారు. 2009లో విశాఖపట్నం నుంచి పార్లమెంటుకు పోటీ చేస్తే స్థానికేతర అభ్యర్థి అంటూ దుష్ప్రచారం చేశారని, ప్రజలు మాత్రం తనను ఆదరించారని, అందుకు తాను విశాఖవాసులకు జీవితాంతం రుణపడి ఉంటానని చెప్పారు. రెండేళ్ల నుంచి సిట్టింగ్ ఎంపీగా తాను ఇక్కడ ఉండగానే సుబ్బిరామి రెడ్డి విశాఖ తనదంటూ ప్రచారం ప్రారంభించారని, ఆ సమయంలోనే తాను నియోజకవర్గం మారనని చెప్పానన్నారు.
ఇంతలో సమైక్యాంధ్ర ఉద్యమం వచ్చిందని, ప్రజల మనోభావాలు అధిష్టానానికి వివరించానన్నారు. పార్టీ పెద్దలు వినిపించుకునే పరిస్థితుల్లో లేనప్పుడు, ఏం కావాలో అడుగుదామన్నానని, అలాంటి సమయంలో సొంత పార్టీ వారే సమైక్యాంధ్రకు ద్రోహం చేస్తున్నారంటూ ప్రచారం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కొద్ది రోజుల క్రితం దిగ్విజయ్ సింగ్ ఫోన్ చేసి బాపట్ల, నర్సారావుపేట, విజయవాడ నియోజకవర్గాల్లో ఎక్కడకు వెళ్తారని ఫోన్ చేసి అడిగారని, అది తనను బాధించిందన్నారు.
ఢిల్లీకి పిలిచి అధిష్టానం పెద్దలు అడిగితే దానిని వదిలేసే దానిన్నారు. అలాగే విభజన విషయంలో కాంగ్రెస్ అధిష్ఠానం ఏకపక్షంగా వ్యవహరిస్తుందని అర్థమైంది. అందుకే పార్లమెంటులో విభజన బిల్లు పెట్టినప్పుడు ఏ మహిళా ఎంపీ వెల్లోకి రాకపోయినా తాను వెళ్లానన్నారు. ఏ పార్టీలో నిర్ణయించుకోలేదని, ఎవరితోను చర్చలు జరపలేదన్నారు. అందరిని సంప్రదించాకే నిర్ణయం తీసుకుంటానని చెప్పారు.