చంద్రబాబు, రేవంత్ భేటీపై పురంధేశ్వరి ఏమన్నారంటే?
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ కావడం పట్ల ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి హర్షం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి శనివారం సాయంత్రం భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ సమావేశంలో రాష్ట్ర విభజనకు సంబంధించి ఆస్తులు, అప్పులు పంపకాలకు సంబంధించి సమస్యలు పరిష్కారమవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
ముఖ్యమంత్రులు నేరుగా భేటీ కావడం వలన అపరిష్కృతంగా ఉన్న పలు సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని అభిప్రాయపడ్డారు పురందేశ్వరి. అంతేగాక, రాష్ట్ర విభజన ఆస్తులు, అప్పుల పంపకాలకు సంబంధించి కేంద్రం ఇంతకుముందే కమిటీ వేసిందని.. ఆ కమిటీలు చర్చించే కంటే సీఎంలు భేటీ కావడం పరిష్కారానికి మార్గం ఏర్పడుతుందని ఆమె తెలిపారు.

ప్రారంభమైన సీఎంల సమావేశం
హైదరాబాద్లోని మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవన్ వేదికగా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి శనివారం సాయంత్రం సమావేశమయ్యారు. రాష్ట్ర విభజన సమయం నుంచి రెండు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలు, అపరిష్కృతంగా ఉన్న అంశాలపై భేటీలో చర్చ కొనసాగుతోంది.
ముందుగా జూబ్లీహిల్స్ నుంచి ప్రజాభవన్కు చేరుకున్న ఏపీ సీఎం చంద్రబాబునాయుడుకు తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి, మంత్రులు పుష్పగుచ్ఛం అందజేసి సాదర స్వాగతం పలికారు. అనంతరం ప్రజాభవన్లోకి చేరుకున్న చంద్రబాబును శాలువతో సత్కరించిన రేవంత్రెడ్డి.. కాళోజీ నారాయణరావు రాసిన 'నా గొడవ' పుస్తకాన్ని బహుకరించారు.
అనంతరం విభజన సమస్యల పరిష్కారమే అజెండాగా ముఖ్యమంత్రుల సమావేశం ప్రారంభమైంది. తెలుగు రాష్ట్రాలు కలిసి ముందుకు సాగేందుకు, ఉమ్మడిగా అభివృద్ధి సాధించేందుకు ఈ ఇద్దరు ముఖ్యనేతల సమావేశం వేదికైంది. ఈ సమావేశంలో తెలంగాణ నుంచి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్బాబు తదితరులు చర్చల్లో పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్ నుంచి రెవెన్యూశాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, రహదారులు భవనాలశాఖ మంత్రి జనార్దన్రెడ్డి, పర్యాటకశాఖ మంత్రి కందుల దుర్గేశ్ పాల్గొన్నారు. ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి పీయూశ్ కుమార్తో పాటు రెండు రాష్ట్రాల ప్రభుత్వ సీఎస్లు శాంతికుమారి, నీరబ్కుమార్ ప్రసాద్తో పాటు ఇతర శాఖల అధికారులు పలువురు హాజరయ్యారు.












Click it and Unblock the Notifications