ఎపికి హోదాపై ఈ సమావేశాల్లోనే నిర్ణయం తీసుకోండి: జైట్లీని కోరిన పివి రమేష్
న్యూఢిల్లీ: తమ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే విషయంపై ఈ పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లోపే నిర్ణయం తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పివి రమేష్ కోరారు. రాష్ట్ర విభజన వల్ల ఏపీ కేంద్రంపై ఆధారపడాల్సి వస్తోందని ఆయన అన్నారు. రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో కేంద్ర మంత్రి అరుణ్జైట్లీ సమావేశం ముగిసిన తర్వాత ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు.
రెవెన్యూలోటు కింద కేంద్రం నుంచి రావాల్సిన రూ. 13,779 కోట్లను ఈ బడ్జెట్లోనే కేటాయించాలని కోరామన్నారు. రాజధాని నిర్మాణానికి రూ. 4వేల కోట్లు, వెనుకబడిన జిల్లాలకు రూ. 200 కోట్లు చొప్పున కేటాయించాలని చెప్పారు.
ఉత్తరాఖండ్, హిమాచల్ తరహాలో ఆంధ్రప్రదేశ్కు పారిశ్రామిక రాయితీలు ఇవ్వాలని విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. ఏపీ రాజధాని నిర్మాణానికి నిధుల సేకరణకు పన్ను మినహాయింపు ఇవ్వాలని కోరినట్లు ఏపీ ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి పీవీ రమేష్ చెప్పారు.
రాష్ట్రంలో వెనుకబడిన 7 జిల్లాలకు రూ.200కోట్లు చొప్పున ఆర్థిక సాయం అడిగినట్లు ఆయన చెప్పారు. చట్టప్రకారం రాష్ట్రానికి చాలావరకు రావాల్సి ఉందన్నారు. రాజధాని నిర్మాణానికి బడ్జెట్లోనే రూ.4వేలకోట్లు కేటాయించాలని కోరినట్లు తెలిపారు.