కేశినేనిపై పీవీపీ 100 కోట్ల పరువు నష్టం దావా .. ఇక వార్ కేశినేని వర్సెస్ పీవీపీ మధ్యనేనా ?
విజయవాడ ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలతో నడుస్తున్న ట్వీట్ ల వార్ కాస్తా ఇప్పుడు కేశినేని వర్సెస్ పీవీపీగా మారిపోయింది. విజయవాడ కేంద్రంగా ఆసక్తికర రాజకీయం నడుస్తోంది. కేశినేని నానీ ఒక పక్క సొంత పార్టీ నేతలతోనూ, మరోపక్క వైసీపీ నేతలతోనూ పోరాటం చేస్తున్నారు. కేశినేని వర్సెస్ బుద్దా వెంకన్న ట్వీట్ వార్ లో జోక్యం చేసుకున్న పీవీపీ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేశినేని నానీకి, బుద్దా వెంకన్నకు చురకలు అంటించారు. అంతేనా ఇక ఏకంగా కేశినేని నానీపై పరువు నష్టం దావా వేసి నోటీసులు పంపించారు. అంతే కాదు మరో రెండు టీవీ చానల్స్ కు కూడా ఆయన లీగల్ నోటీసులు పంపించారు.
ట్విట్టర్ లో కేశినేని వర్సెస్ బుద్దా వెంకన్న ఎపిసోడ్ లో సడన్ గా పీవీపీ .. ట్విట్టర్ వేదికగా పోస్ట్
ట్విట్టర్ వేదికగా తిట్టుకుంటున్న కేశినేని వర్సెస్ బుద్దా వెంకన్న వ్యవహారంలో మధ్యలో ఎంటర్ అయ్యారు పీవీపీ . ప్రజా సమస్యల కోసం పని చెయ్యాల్సిన నాయకులు అది పక్కన పెట్టి సోషల్ మీడియాలో తిట్టుకోవటంపై స్పందించిన పీవీపీ చట్టసభల్లో బల్లలరిగేలా కూర్చుని బ్యాక్ సీట్లు పెంచడం కాదని చెప్పి మిమ్మల్ని ఎంచుకున్న ప్రజలకు ఏమైనా చేసేది ఉందా? లేదా? అని ప్రశ్నించారు. అంతే కాదు ట్విట్టర్లో కూర్చుని కాలక్షేపం చేస్తారా? అని మండిపడ్డారు. మీ ఇద్దరి పరస్పర ఆరోపణలతో ప్రజలంతా ఏకీభవిస్తున్నారని ఒకరి ఘనత మరొకరు బాగానే చెప్పుకుంటున్నారని పీవీపీ ట్వీట్లో పేర్కొన్నారు.
ఎన్నికల సమయంలో దుష్ప్రచారం చేశారని కేశినేని నానీపై పరువునష్టం దావా వేసిన పీవీపీ
ఇక అక్కడితో ఆగలేదు పీవీపీ . గత ఎన్నికల సమయంలో తనపై కేశినేని నానీ దుష్ప్రచారం చేశారని పరువు నష్టం దావా వేశారు . వంద కోట్ల పరువు నష్టం దావా వేసిన ఆయన ఇందుకు సంబంధించి ఎంపీ కేశినేని నానికి లీగల్ నోటీసులు పంపించారు. ఎన్నికల సందర్భంగా కేశినేని నాని నోటికి వచ్చిన విధంగా ప్రచారం చేశారని , తనను నేరస్తుడని ఆరోపించారంటూ పొట్లూరి మండిపడ్డారు. అందుకే తాను ఎంపీకి లీగల్ నోటీసులు ఇచ్చినట్లు పొట్లూరి తెలిపారు. అదేవిధంగా తనపై ఎక్కడా కూడా కేసులు లేవని, అలాంటిది తనపై టిడిపి ఎంపి కేశినేని బురదచల్లే ప్రయత్నం చేశారని ఆరోపించారు పీవీపీ . పనామా పేపర్లలో తన పేరుందని కేశినేని నానీ చేసిన ఆరోపణలు నిరూపించకపోతే తాను లీగల్ నోటీసును ఉపసంహరించుకునేది లేదని స్పష్టం చేశారు. దీనిపై ఆయన ట్విట్టర్లో పోస్టు కూడా పెట్టారు. ‘కొంతమంది పెద్దలు షో మాస్టర్లలా కాకుండా టాస్క్ మాస్టర్లలా ఉండాలి అని ఈ మధ్యనే చెప్పారు.. వారి సలహాననుసరించి ఆ షో మాస్టర్ కి టాస్క్ మాస్టర్ ఎలా ఉంటాడో చెప్పడానికి చిన్న టీజర్ వదులుతున్నాను' అంటూ పోస్ట్ చేసి నోటీసులు కూడా ట్యాగ్ చేశారు పీవీపీ .
పీవీపీ నోటీసులకు స్పందించిన కేశినేని నానీ.. ఉడుత ఊపుళ్లు చిన్నప్పుడే చూశానని సమాధానం
ఇక ఈ నోటీసులపై కూడా కేశినేని నానీ సోషల్ మీడియా వేదికగా స్పందించారు .నాని ట్విట్టర్ లో బదులిచ్చారు. ఈ ఉడుత ఊపుళ్లు నేను చిన్నప్పుడే చూశానంటూ లీగల్ నోటీసులను చాలా లైట్ గా తీసుకున్నారు. నోటీసులు పంపడం ద్వారా తననేమీ భయభ్రాంతులకు గురిచేయలేరని కేశినేని నాని ట్వీట్ ద్వారా వెల్లడించినట్లు తెలుస్తోంది. మరి దీనిపై పీవీపీ ఎలా స్పందిస్తారో .. భవిష్యత్ లో ఈ సోషల్ మీడియా రగడ మరీ రూపు తీసుకుంటుందో వేచి చూడాలి .