సీఎం జగన్ కు సంచలన సవాల్ - ఒకే అంటే తక్షణం రాజీనామా: ఎంపీ రఘురామ - కొత్తగా పోరాట సంస్థ
వైసీపీలో నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు రెబల్గిరీ తారా స్థాయికి చేరింది. కొద్ది నెలలుగా సొంత పార్టీ నేతలపైనే విమ్శలు, వ్యంగ్యాస్త్రాలు సంధిస్తోన్న ఆయన.. తాజాగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు సంచలన సవాలు విసిరారు. ఆ సవాలుకు జగన్ ఒప్పుకుంటే గనుక తక్షణమే ఎంపీ పదవికి రాజీనామా చేసి, ఎన్నికలకు వెళతానని చెప్పారు. హిందూ దేవాలయాలపై దాడులను ఖండిస్తూ శుక్రవారం ఒకరోజు నిరసన దీక్షకు దిగిన రఘురామ.. దీక్ష ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేశారు.

చెడ్డపేరు రావొద్దనే..
కొద్ది నెలలుగా హైకమాండ్ పై నిత్యం విమర్శలు గుప్పిస్తోన్న ఎంపీ రఘరామను అనర్హుడిగా ప్రకటించాలని వైసీపీ ఇదివరకే లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు ఫిర్యాదు చేసింది. ఆ క్రమంలోనే మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. రఘురామకు నిజంగా దమ్ముంటే పార్టీకి, పదవికి వెంటనే రాజీనామా చేయాలని సవాల్ విసిరారు. ఈ సవాల్ పై శుక్రవారం స్పందించిన రఘరామ.. వైసీపీకి చెడ్డ పేరు రాకూడదనే తాను ఇన్నాళ్లూ మాట్లాడుతున్నానని, రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలన్న డిమాండ్ ను వెనక్కి తీసుకోబోనని చెప్పారు. అంతేకాదు..

సవాలుకు సరేనంటే రాజీనామా..
‘‘నర్సాపురం ఎంపీ పదవికి నేను రాజీనామా చేసి గెలిస్తే.. ఆ ఫలితాన్ని రాజధానికి రెఫరెండంగా భావించి.. అమరావతిలోనే రాజధానిని కొనసాగిస్తానని సీఎం జగన్ రాస్తారా? ఈ సవాలుకు జగన్ ను బాలినేని ఒప్పించగలరా? నర్సాపురంలో నా గెలుపును అమరావతిపై రెఫరెండంగా స్వీకరించేందుకు జగన్ సిద్ధంగా ఉన్నారా? ఒకవేళ సిద్ధమే అయితే మరుక్షణం నేను రాజీనామా సమర్పించి, ఎన్నికలకు వెళతాను'' అని రఘురామ సవాలు విసిరారు.

రఘురామ ఐక్య పోరాట సంస్థ..
హిందూ దేవుళ్ళ విగ్రహాలపై జరుగుతోన్న దాడులు ఏవో మతిలేని చర్యలుగా భావిస్తుండటం వల్లే ఘటనలు పునరావృతం అవుతున్నాయని, అంతర్వేది దేవాలయానికి చెందిన రథం దగ్ధం కావడంతో హిందూ సమాజం మేల్కొందని రెబల్ ఎంపీ రఘురామ అన్నారు. హిందూ వ్యవస్థల పరిరక్షణ కోసం ‘‘సనాతన స్వదేశీ సేన'' పేరుతో ఒక ఐక్య పోరాట సంస్థని ఏర్పాటు చేయాలని నిర్ణయించామని, ఆ సంస్థలోకి పార్టీలకు అతీతంగా అన్ని జిల్లాల వాళ్లను భాగస్వాములు చేసుకుంటామని, సీఎం వైఎస్ జగన్ సహకారం కూడా ఈ సంస్థకు ఉండాలని కోరుకుంటున్నానని రఘరామ వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications