చంద్రబాబు రహస్య అజెండా, జగన్ జైలుకే: రఘువీరా
కడప: రాజధాని ఏర్పాటులో తెలుగుదేశం పార్టీకి రహస్య అజెండా ఉన్నట్లుందని ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షులు రఘువీరా రెడ్డి ఆదివారం ఆరోపించారు. రాజధాని పైన టీడీపీ నాయకులు, మంత్రులు తలా ఒకమాట మాట్లాడుతూ ప్రజలను మభ్యపెడుతున్నారని, ఎవరి రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమో, మరో ఇతర పనుల కోసమో చంద్రబాబు పాకులాడుతూ ప్రజలను మభ్యపెట్టేలా ప్రకటనలు చేస్తూ అయోమయానికి గురి చేస్తున్నారన్నారు.
కేంద్రం ఏర్పాటు చేసిన శివరామకృష్ణన్ కమిటీ నివేదిక రాకుండానే మంత్రి నేతృత్వంలో ఒక కమిటీ, నిర్ధారణ పేరుతో మరో కమిటీ ఎందుకు వేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. తాత్కాలిక రాజధాని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించడంతో ఆంతర్యం ఏమిటన్నారు. సుమారు రూ.13 కోట్లు ఖర్చు పెట్టి హైదరాబాదులో తన చాంబరును ఏర్పాటు చేసుకుంటున్న చంద్రబాబు మరో తాత్కాలిక రాజధాని ఎందుకో చెప్పాలన్నారు. అన్ని పార్టీల ఏకాభిప్రాయంతో రాజధాని ఉండాలన్నారు.

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎప్పటికైనా జైలుకు వెళ్లకతప్పదన్నారు. కేంద్రంలో హమారా సర్కార్, మోడీ సర్కార్ అంటూ ఆరెస్సెస్, భజరంగదళ్, విహెచ్పి, శివసేనలు చెప్పుకోవడంలోనే కేంద్రంలో మతతత్వ పాలన జరుగుతోందనే వాస్తవం కనిపిస్తోందన్నారు. మోడీ సర్కార్ నెలరోజుల పాలనలోనే 14.5 శాతం రైల్వేచార్జిలు ప్రయాణికులపై పెనుభారం మోపిందన్నారు.
బిజెపి ఎన్నికల ముందు చేసిన ప్రచారానికి ప్రస్తుతం అవలంభిస్తున్న తీరుకు ఎంతో వ్యత్యాసం ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీకి 130 ఏళ్ళ ఘనచరిత్ర ఉందని, దేశం కోసం ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీలు ప్రాణత్యాగం చేశారని అన్నారు. ప్రతిపక్ష పార్టీలకు ఇందిరాగాంధీ కుటుంబాన్ని ఆడిపోసుకోవడం తప్ప తమ గురించి చెప్పుకునే గొప్ప విషయాలు ఏమీ లేవన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు అధికారంలోకి రావడమే పరమావధిగా ఎన్నికల ముందు 250 వాగ్దానాలు చేశారన్నారు.
రైతులకు రుణమాఫీ కోసం రూ.87వేల కోట్ల భారం మోస్తామని డ్వాక్రా మహిళల కోసం రూ.14వేల కోట్లు భరిస్తామని హామీలిచ్చారన్నారు. అధికారంలోకి వచ్చి తొలి సంతకం వ్యవసాయ, డ్వాక్రా రుణాల రద్దుపై పెట్టి మూడు నెలలు దాటినా ఇంత వరకు అమలు చేయలేదన్నారు. ఉద్యోగులకు పదవీ విరమణ వయస్సు 60 ఏళ్లకు పెంచి అమలు చేస్తే ఖజానా ఖాళీ అవుతుందనే భయంతో దాని జోలికి పోకుండా మోసగించారన్నారు.












Click it and Unblock the Notifications