విభజనపై రాహుల్ క్షమాపణ చెప్పాకే రావాలి: ప్రభాకర చౌదరి
అనంతపురం: రాష్ట్ర విభజనపై క్షమాపణ చెప్పిన తర్వాతనే కాంగ్రెసు పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అనంతపురం జిల్లాలో అడుగు పెట్టాలని అనంతపురం నగర శాసనసభ్యుడు ప్రభాకర్ చౌదరి అన్నారు. జిల్లాలో ల్యాండ్ మాఫియాపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు.
కబ్జాలకు పాల్పడితే తెలుగుదేశం పార్టీ నాయకులను కూడా ఉపేక్షించబోమని ఆయన చెప్పారు. గోదావరి పుష్కరాలు బాగా జరగాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారని ఆయన చెప్పారు. పుష్కరాల విశిష్టతను చాటి చెప్పేందుకు చంద్రబాబు ప్రయత్నించారని ఆయన చెప్పారు.

పుష్కరాల సందర్భంగా రాజమండ్రి కోటగుమ్మం పుష్కర ఘాట్లో తొక్కిసలాట జరిగి మృతి చెందినవారి అంశాన్ని రాజకీయం చేయడం తగదని ఆయన అభిప్రాయపడ్డారు. రాహుల్ గాంధీ ఈ నెల 24వ తేదీన అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు.
అనంతపురం జిల్లా మడకశిర, ఓబులదేవర చెరువుల్లో ఆయన పర్యటిస్తారు. ఆయా గ్రామాల్లో ఆత్మహత్య చేసుకున్న వ్యక్తుల కుటుంబాలను ఆయన పరామర్శిస్తారు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత తొలిసారి రాహుల్ గాంధీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తున్నారు. ఇంతకు ముందు ఆయన తెలంగాణలో పర్యటించారు.












Click it and Unblock the Notifications