ప్రయాణీకుల కోసం దక్షిణ మధ్య రైల్వే మరొ కొత్త స్మార్ట్ఫోన్ యాప్ 'తథాస్తు' (ఫోటోలు)
హైదరాబాద్: ప్రయాణీకుల సౌకర్యార్ధం రైళ్ళ సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందించేందుకు దక్షిణ మధ్య రైల్వే తథాస్తు (ట్రెయిన్ అరైవల్ డిపార్చర్ అండ్ అమినిటీస్ ఎట్ స్టేషన్స్) పేరిట మరో స్మార్ట్ఫొన్ అప్లికేషన్ను ప్రారంభించింది. ఈ యాప్ను దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ పీకే శ్రీవాత్సవ మంగళవారం సికింద్రాబాద్లోని రైల్ నిలయంలో ప్రారంభించారు.
అనంతరం జీఎం మాట్లాడుతూ తథాస్తు యాప్ ఆవిష్కరణ దక్షిణమధ్య రైల్వే చరిత్రలో విప్లవాత్మకమైనదన్నారు. ఈ యాప్ ద్వారా జోన్ పరిధిలో ఉన్న 25 మేజర్ రైల్వే స్టేషన్లలోని సౌకర్యాల వివరాలు అందుబాటులో ఉంటాయన్నారు. ఈ యాప్ ద్వారా రైలు సమాచారం, ప్రయాణిస్తున్న ప్రాంతాన్ని తెలుసుకోవచ్చు.
ఎంపిక చేసిన 25 స్టేషన్లలో హైదరాబాద్, కాచిగూడ, సికింద్రాబాద్, మంచిర్యాల, గుంతకల్లు, నాందేడ్, రామగుండం, వికారాబాద్, తాండూర్, సిర్పూర్ కాగజ్నగర్ స్టేషన్లతోపాటు మరో 15 మేజర్ స్టేషన్లు ఉన్నాయి. యాప్లో హిందీ, ఇంగ్లీష్, తెలుగు భాషలలో సమాచారం అందుబాటులో ఉంటుంది. గూగుల్ ప్లే స్టోర్ నుంచి అండ్రాయిడ్ బేస్డ్ ఫోన్లలో, ఆపిల్ యాప్ స్టోర్ ద్వారా ఐవోఎస్ బేస్డ్ ఫోన్లలో ఈ యాప్ను ఉచితంగా డౌన్లోడ్ చేసుకునే వీలుంది.
గతంలో ప్రకటించిన హైలైట్స్ (హైదరాబాద్ లైవ్ ట్రెయిన్ ఎంక్వయిరీ సిస్టం)యాప్కు మంచి స్పందన వస్తున్నదని జీఎం శ్రీవాత్సవ తెలిపారు. ఈ కార్యక్రమంలో రైల్వే అధికారులు సునీల్ కుమార్ అగర్వాల్, మహబూబ్ అలీ, ఎస్కే మిశ్రా తదితరులు పాల్గొన్నారు.