DC vs PBKS: 265 పరుగుల్నీ ఊదేసిన పంజాబ్-రాహుల్ 152 వృథా-రికార్డుల మోత..!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్ )లో భాగంగా ఇవాళ ఢిల్లీలో జరిగిన ఢిల్లీ క్యాపిటల్స్-పంజాబ్ కింగ్స్ మ్యాచ్ (DC vs PBKS) రికార్డుల మోతతో దద్దరిల్లిపోయింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ ఏకంగా 265 పరుగులు చేసి సంచలనం సృష్టించింది. దీన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ అంతకు మించిన విధ్వంసం సృష్టించింది. దీంతో స్టేడియంలో ఇరు జట్లూ కలిపి 529 పరుగులు చేసి పాత రికార్డులు తిరగరాశాయి.
ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్ కేఎల్ రాహుల్ ఇవాళ ఢిల్లీ ఫిరోజ్ షా కోట్లా మైదానంలో విధ్వంసమే సృష్టించాడు. మైదానం నలువైపులా ఫోర్లు, సిక్సర్లు కొడుతూ స్కోరు బోర్డును పరుగులెత్తించాడు. ఇదే క్రమంలో చూస్తుండగానే సెంచరీ, ఆ తర్వాత 150 పరుగులు కూడా దాటేశాడు. కేఎల్ రాహుల్ 152 పరుగుల అజేయ ఇన్నింగ్స్ లో 9 సిక్స్ లు, 16 ఫోర్లు ఉన్నాయి. అతనికి ఆద్యంతం అండగా నిలిచిన నితీష్ రాణా కూడా 11 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 91 పరుగులు చేశాడు. వీరిద్దరి స్కోర్లతో ఢిల్లీ 265 పరుగులు చేసింది.

అనంతరం 266 పరుగుల కష్టసాధ్యమైన లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ ఆరంభం నుంచే ఎదురుదాడికి దిగింది. ఓపెనర్లు ప్రియాన్ష్ ఆర్య, ప్రభ్ సిమ్రన్ సింగ్ దూకుడుగా షాట్లు ఆడారు. ప్రభ్ సిమ్రన్ 76 పరుగులు, ప్రియాన్ష్ ఆర్య 43 పరుగులు చేసి అవుటయ్యారు. ఆ తర్వాత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్.. నేహాల్ వధేరా, శశాంక్ సింగ్ తో కలిసి మిగిలిన పని పూర్తి చేసాడు. చివరికి అయ్యర్ 71 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. దీంతో మరో ఏడు బంతులు మిగిలి ఉండగానే పంజాబ్ కింగ్స్ 266 పరుగులు చేసి అద్భుత విజయం తమ ఖాతాలో వేసుకుంది. ఇది ఐపీఎల్ లో ఇప్పటివరకూ అత్యధిక ఛేజింగ్ రికార్డుగా నమోదైంది.

కేఎల్ రాహుల్ సాధించిన 152 పరుగుల స్కోరు ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఓ బ్యాట్స్ మెన్ అత్యధిక స్కోరు. గతంలో రిషభ్ పంత్ 128 అత్యధిక స్కోరుగా ఉండేది. కేఎల్ రాహుల్, నితీష్ రాణా 220 పరుగుల భాగస్వామ్యం ఢిల్లీ క్యాపిటల్స్ కు ఐపీఎల్ లో ఏ వికెట్ కైనా అత్యుత్తమ పార్ట్ నర్ షిప్. గతంలో డేవిడ్ వార్నర్-నమన్ ఓఝా నెలకొల్పిన 189 పరుగుల భాగస్వామ్యం రికార్డు దీంతో బద్దలైంది. అలాగే ఈ 220 పరుగుల భాగస్వామ్యం ఢిల్లీ తరఫున రెండో వికెట్ కు అత్యుత్తమ భాగస్వామ్యం. గతంలో డేవిడ్ వార్నర్-నమన్ ఓఝా చేసిన 189 పరుగుల రికార్డు దీంతో బద్దలైంది. కేఎల్ రాహుల్ చేసిన 152 స్కోరులో అత్యధికంగా 118 పరుగులు బౌండీల ద్వారా వచ్చాయి. గతంలో రిషబ్ పంత్ 102 పరుగుల్ని ఇలా బౌండరీల రూపంలో చేశాడు. పంజాబ్ కింగ్స్ బౌలర్ జేవియర్ బార్లెట్ ఈ మ్యాచ్ లో 69 పరుగులు సమర్పించుకుని చెత్త రికార్డు సాధించాడు. అంతకు ముందు ఇది 66 పరుగులు ఇచ్చిన బౌలర్ ముజీబ్ పేరు మీద ఉండేది. ఇవాళ ఢిల్లీ, పంజాబ్ కలిసి సాధించిన 529 పరుగుల స్కోరు ఐపీఎల్ లో ఓ జట్టు సాధించిన అత్యధిక యాగ్రిగేట్ స్కోరుగా నిలిచింది.












Click it and Unblock the Notifications