ఏపీలోని ఆ ఏడు జిల్లాలకు వర్ష సూచన
అమరావతి: బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ఫలితంగా ఏపీలో పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తోన్నాయి. రెండు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ ఓ మోస్తరు నుంచి భారీ వర్షపాతం నమోదవుతోంది. ప్రత్యేకించి కోస్తా తీర ప్రాంత జిల్లాల్లో అంచనాలకు మించిన స్థాయిలో వర్షపాతం నమోదవుతోంది. అటు ఉత్తరాంధ్ర, ఏజెన్సీ ఏరియాల్లోనూ వర్షాలు దంచికొడుతున్నాయి.
బంగాళాఖాతం ఉత్తర- మధ్య ప్రాంతంలో ఏర్పడిన ఈ ఆవర్తనం వాయుగుండగా మారింది. దీని ఫలితంగా మరో రెండు రోజులు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం తెలిపింది. పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయి. గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది.

విపత్తుల నిర్వహణ విభాగం కూడా భారీ వర్షాలపై జిల్లా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది. ఉత్తరాంధ్ర, కోస్తా తీర ప్రాంత జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో వర్షపాతం నమోదువుతుందని పేర్కొంది.
వాటితో పాటు పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది విపత్తు నిర్వహణ విభాగం పేర్కొంది. మిగిలిన చోట్ల తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉందని వివరించింది. కిందటి నెలతో పోల్చుకుంటే ఈ నెలలో ఆశించిన స్థాయిలో వర్షపాతం నమోదవుతుందని అంచనా వేసింది.
ఇప్పటికే అల్లూరి సీతారామరాజు, బాపట్ల, పల్నాడు, పార్వతీపురం మన్యం, ప్రకాశం, నెల్లూరు, కృష్ణా, శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం, నంద్యాల, కడప జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు పడ్డాయి. చాలాచోట్ల ఆకాశం మేఘావృతమై ఉంటోంది. ఎండ తీవ్రత బాగా తగ్గింది. ఈదురుగాలులతో వర్షాలు కురిశాయి.












Click it and Unblock the Notifications