మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు రాజీనామాలకు ఆమోదం
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడిన రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, బీదా మస్తాన్ రావు రాజీనామాలను రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖర్ ఆమోదించారు. వీరిద్దరూ రాజ్యసభ సభ్యత్వానికి గురువారం మధ్యాహ్నం రాజీనామా చేశారు. రాజీనామా లేఖలను రాజ్యసభ ఛైర్మన్కు అందజేయగా.. ఆమోదం తెలిపినట్లు రాజ్యసభ కార్యాలయం వెల్లడించింది.
మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు తమ ఎంపీ పదవులతోపాటు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి కూడా రాజీనామా చేసిన విషయం తెలిసిందే. మోపిదేవి తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు. తన రాజకీయ భవిష్యత్తుపై త్వరలోనే నిర్ణయం ప్రకటిస్తానని బీదా మస్తాన్ రావు తెలిపారు.

అంతకుముందు వైఎస్సార్సీపీ ప్రాథమిక సభ్యత్వానికి, రాజ్యసభ ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు మోపిదేవి వెంకటరమణ ప్రకటించారు. ఢిల్లీలో మీడియాతో ఆయన మాట్లాడారు. మరో ఎంపీ బీద మస్తాన్రావుతో కలిసి రాజీనామా చేయనున్నట్లు తెలిపారు. త్వరలో తాను టీడీపీలో చేరబోతున్నట్లు చెప్పారు. అధికారం తనకు కొత్తేమీ కాదని మోపిదేవి వెంకటరమణ అన్నారు.
గతంలో ఎన్నో పదవుల్లో పనిచేశానని మోపిదేవి వెంకటరమణ చెప్పారు.
గత సంవత్సర కాలంగా తన నియోజవర్గంలో జరుగుతున్న పరిణామాలతో ఇబ్బంది పడ్డానని మోపిదేవి తెలిపారు. కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులతో రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు. ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి వ్యతిరేకంగా ప్రజలు ఘోరమైన తీర్పు ఇచ్చారన్నారు. ఇప్పటికే చాలా మంది నేతలు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారని తెలిపారు. మరికొంత మంది రాజీనామా చేశారని మోపిదేవి వ్యాఖ్యానించారు.
లోపం ఎక్కడ ఉందనే దానిపై వైఎస్సార్సీపీ అధిష్ఠానం విశ్లేషించుకోవాలని మోపిదేవి సూచించారు. అనుభవం ఉన్న నేత ముఖ్యమంత్రి చంద్రబాబు అని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని ఆయన గాడిలో పెడుతున్నారని తెలిపారు. చంద్రబాబు సారథ్యంలో పనిచేయాలని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. అందుకే తాను టీడీపీలో చేరుతున్నట్లు తెలిపారు.












Click it and Unblock the Notifications