రాజ్యసభ: సుజనపై కన్నేశారా, రేసులో మీడియా ప్రతినిధులు?
హైదరాబాద్: త్వరలో రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి. ఏపీలో నాలుగు రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్నాయి. వాటి కోసం చాలామంది వరుసలో ఉన్నారు. తమ తమ పద్ధతుల్లో రాజ్యసభ కోసం పలువురు నేతలు లాబీయింగ్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.
ప్రస్తుత లెక్క ప్రకారం చూసుకుంటే టిడిపి - బిజెపి కూటమికి మూడు, వైసిపికి ఒక స్థానం దక్కనుంది. ఆపరేషన్ ఆకర్ష్ ద్వారా వైసిపికి ఆ ఒక్క స్థానం కూడా దక్కకుండా చేయాలని తెలుగుదేశం పార్టీ పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలను చేర్చుకున్న చంద్రబాబు.. మరికొందరికి గాలం వేస్తున్నారని అంటున్నారు.
రాజ్యసభ స్థానం కోసం ఇప్పటికే పలువురు నేతలు లాబీయింగ్ చేస్తుండగా.. వారికి తోడు కొందరు మీడియా కూడా తెరపైకి వచ్చిందని వార్తలు వస్తున్నాయి. రాజ్యసభ స్థానం కోసం ఓ మీడియా అధినేత.. చంద్రబాబు వద్ద ఒత్తిడి తెస్తున్నట్లుగా తెలుస్తోందని వార్తలు వస్తున్నాయి.
అంతేకాదు, మరో మీడియా సంస్థలో కీలక పాత్ర పోషిస్తున్న ఒకరు... కేంద్రమంత్రి, టిడిపి ఎంపీ సుజనా చౌదరి పైన కన్నేసినట్లుగా కూడా పుకార్లు వినిపిస్తున్నాయి. ఆయన ఏకంగా సుజన స్థానం పైనే కన్నేశారని అంటున్నారు. అందుకే సుజనను టార్గెట్ చేసి కథనాలు తీసుకు వస్తున్నారని అంటున్నారు.
రామోజీ రావు సమీప బంధువు కూడా ఒకరు టిడిపి కోటాలో రాజ్యసభ కోసం ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది. అయితే, ఈ మీడియా ప్రతినిధుల లాబీయింగ్ ఎంత మేరకు ప్రయత్నిస్తుందో చూడాలని అంటున్నారు.
ఇప్పటికే రాజ్యసభ అంశం చంద్రబాబుకు పెద్ద తలనొప్పిగా మారింది. ఓ వైపు కాపు సామాజిక వర్గం, మరోవైపు సుజనా చౌదరి, ఇంకోవైపు ప్రాంతం కోణం, పైగా.. బిజెపికి ఓ స్థానం ఇవ్వాల్సి రావడం.. ఇలా ఎన్నో సమస్యలు నెలకొన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు ఎవరికి అవకాశం ఇస్తారు.. ఎవరిని బుజ్జగిస్తారో ముందుముందు తెలుస్తుందంటున్నారు.