అసలు ఏం జరిగింది: దేవినేనితో వర్మ, ఆ పాటల సెన్సార్ చేయండి
విజయవాడ: సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ శనివారం నాడు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దేవినేని నెహ్రూతో భేటీ అయ్యారు.ఈ సందర్భంగా వారి మధ్య 1982 నుంచి జరిగిన పరిణామాల పైన చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది.
వంగవీటి సినిమాకు అనవసర ప్రచారం కల్పించవద్దని, ముప్పై ఏళ్ల కింద చిన్న గొడవ వల్ల రెండు కుటుంబాలకు నష్టం జరిగిందని దేవినేని చెప్పారని తెలుస్తోంది. గత ముప్పై ఏళ్లుగా విజయవాడ చాలా ప్రశాంతంగా ఉందని నెహ్రూ చెప్పారు.
రామ్ గోపాల్ వర్మకు తాను కొత్తగా ఇచ్చిన సమాచారం ఏమీ లేదని, వర్మకు ముందే పూర్తిగా తెలుసునని దేవినేని నెహ్రూ అభిప్రాయపడ్డారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన పాటలను సెన్సార్ చేయాలని మాత్రమే వర్మకు సూచించానని నెహ్రూ చెప్పారు. వర్మ విడుదల చేసిన వంగవీటి సినిమాలోని రెండు పాటలు సామాజిక వర్గాల పేర్లను ప్రస్తావిస్తూ సాగిన నేపథ్యంలో దేవినేని ఈ సూచన చేశారు.
రామ్ గోపాల్ వర్మ, దేవినేని నెహ్రూ మధ్య దాదాపు గంటకు పైగా సమావేశం జరిగింది. వంగవీటి, దేవినేని కుటుంబాల మధ్య ఉన్న శుత్రుత్వం, ఆ నాటి ఘర్షణలు వంటి పలు విషయాలపై లోతుగా తెలుసుకునేందుకు నెహ్రూతో వర్మ కలిసినట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
అంతకుముందు నగరంలో ప్రముఖ న్యాయవాది కర్నాటి రామ్మోహన్ రావును రామ్ గోపాల్ వర్మ కలిశారు. పలు కేసులకు సంబంధించి ఆయన నుంచి వర్మ సమాచారాన్ని సేకరించారు. అయితే, వర్మతో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన కర్నాటి.. అసలు విజయవాడలో బేసిక్గా రౌడీయిజమే లేదని చెప్పారు.