11న కడపకు చంద్రబాబు- వెంకయ్య చౌదరి తనిఖీ
Tirumala: ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. మంగళవారం నాడు 64,252 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 25,943 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 3.68 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది.
వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో అన్ని కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. ఎంబీసీ వరకు క్యూలైన్ ఏర్పడింది. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పట్టింది. కంపార్ట్మెంట్లు, క్యూ లైన్లల్లో ఉన్న వారికి టీటీడీ సిబ్బంది అన్నప్రసాదం, మజ్జిగ, మంచినీరు, అల్పాహారాన్ని పంపిణీ చేశారు.

కాగా- శ్రీరామనవమిని పురస్కరించుకుని కడప జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి ఆలయం బ్రహ్మోత్సవాలకు ముస్తాబు అవుతోంది. ఏప్రిల్ 6 నుండి 14వ తేదీ వరకు శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలను టీటీడీ అధికారులు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు.
ఇందులో భాగంగా ఆలయంలో ఏప్రిల్ 1న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, ఏప్రిల్ 5న బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాలలో ప్రతి రోజు ఉదయం 7:30 నుండి 9:30 గంటల వరకు, మళ్లీ రాత్రి 7 నుండి 9 గంటల వరకు వివిధ వాహన సేవలు జరుగుతాయి.

ఏప్రిల్ 6వ తేదీన ఉదయం 9:30 నుండి 10:15 నిమిషాల వరకు వృషభ లగ్నంలో ధ్వజారోహణ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు అర్చకులు. బ్రహ్మోత్సవాలకు సర్వదేవతలనూ ఆహ్వానిస్తారు. అదే రోజు రాత్రి శేష వాహనంపై కోదండరాముడు ఊరేగుతాడు. 7వ తేదీన ఉదయం వేణుగాణ అలంకారంలో కటాక్షిస్తాడు. రాత్రి- హంస వాహన సేవ ఉంటుంది.
8న ఉదయం వటపత్రశాయి అలంకారం, రాత్రి సింహ వాహనం, 9న ఉదయం నవనీత కృష్ణాలంకారం, రాత్రి హనుమంత వాహనంపై స్వామివారు ఊరేగుతారు. 10వ తేదీన ఉదయం మోహినీ అలంకారంలో దర్శనం ఇస్తాడు. రాత్రి గరుడసేవ ఉంటుంది. 11వ తేదీన ఉదయం శివధనుర్బాణ అలంకరణ, రాత్రి- కళ్యాణోత్సవము/ గజవాహన సేవ ఉంటుంది.
12వ తేదీన ఉదయం కన్నులపండువగా రథోత్సవం. 13న ఉదయం కాళీయమర్ధన అలంకారం, రాత్రి అశ్వవాహనంపై సీతాసమేత కోదండరాముడు భక్తులను కరుణిస్తాడు. 14వ తేదీన ఉదయం చక్రస్నానంతో ఈ బ్రహ్మోత్సవం ముగుస్తుంది. రాత్రి ధ్వజావరోహణాన్ని నిర్వహిస్తారు. 15వ తేదీ సాయంత్రం 6 నుండి రాత్రి 9 గంటల వరకు పుష్పయాగం నిర్వహించనున్నారు అర్చకులు.
ఈ బ్రహ్మోత్సవాలకు సంబంధంచిన ఏర్పాట్లను టీటీడీ అధికారులు చురుగ్గా కొనసాగిస్తోన్నారు. టీటీడీ అదనపు కార్యనిర్వాహణాధికారి సీహెచ్ వెంకయ్య చౌదరి ఈ పనులను పర్యవేక్షించారు. జేఈవో వీ వీరబ్రహ్మోంతో కలిసి ఆయన ఒంటిమిట్టకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.
అనంతరం ఆలయ పరిసరాలు, కల్యాణవేదిక, క్యూలైన్లు, భక్తులకు ఏర్పాటు చేసిన కౌంటర్లను వెంకయ్య చౌదరి పరిశీలించారు. ఇక్కడ చేపట్టిన అభివృద్ధి పనుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఏప్రిల్ 11వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రీ సీతారాముల వారికి పట్టువస్త్రాలను సమర్పించనున్నారని వెంకయ్య చౌదరి తెలిపారు.
భక్తులకు అన్నప్రసాదాల పంపిణీ, స్వామివారి తలంబ్రాలు, శ్రీవారి లడ్డూ ప్రసాదం, మంచినీరు, మజ్జిగ అందించడానికి వీలుగా పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. భక్తుల రద్దీ, గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని జిల్లా యంత్రాంగంతో సమన్వయం చేసుకుని ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. టీటీడీ వివిధ విభాగాల అధికారులు ప్రణాళిక బద్దంగా పనులు చేపట్టారని వివరించారు.
2015 నుండి ఒంటిమిట్టలో శ్రీసీతారాముల కల్యాణాన్ని రాష్ట్ర ప్రభుత్వ పండుగగా నిర్వహిస్తోన్నామని పేర్కొన్నారు. కల్యాణ వేదిక వద్ద భక్తుల ప్రవేశ, నిష్క్రమణ మార్గాలు, ఆలయ పరిసర ప్రాంతాలలో భక్తులను ఆకట్టుకునేలా పుష్పాలంకరణ, విద్యుత్ అలంకరణలు, భక్తులు వీక్షించేలా ఎల్ఈడీ స్క్రీన్లను అమర్చనున్నామని చెప్పారు.












Click it and Unblock the Notifications