అందుకే చిరంజీవి అలా అడిగారు: సిఆర్, కెసిఆర్కు థ్యాంక్స్
హైదరాబాద్: కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ నాయకుడు సి. రామచంద్రయ్య తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావును ప్రశంసించారు. ఏడాది పాలనలో హైదరాబాదులోని ఆంధ్రులను మంచిగా చూసుకున్నారని అంటూ ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుకు కృతజ్ఞతలు తెలిపారు.
అదే సమయంలో తమ పార్టీ నాయకుడు చిరంజీవి రాష్ట్ర విభజన సమయంలో చేసిన డిమాండ్ను గుర్తు చేశారు. హైదరాబాదులో సమస్యలు రాకూడదనే చిరంజీవి హైదరాబాదును కేంద్ర పాలిత ప్రాంతం (యుటి)గా చేయాలని అడిగారని ఆయన అన్నారు. కాంగ్రెసు వల్లనే పునర్విభజన చట్టంలో లోపాలు చోటు చేసుకున్నాయని కూడా రామచంద్రయ్య బుధవారంనాడు అన్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన సొంతం కోసమే మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. చంద్రబాబు ఆత్మరక్షణలో పడ్డారని అందుకే మంత్రులు అలా మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. చంద్రబాబుపై మరో కాంగ్రెసు నాయకుడు శైలజానాథ్ కూడా మండిపడ్డారు. స్వీయ ప్రయోజనం కోసం చంద్రబాబు మాట్లాడుతున్నారని ఆయన అన్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని రాజకీయంగా దెబ్బతీసేందుకు కుట్ర జరుగుతోందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. నవ్యాంధ్ర అభివృద్ధిని అడ్డుకునేందుకు జగన్, కేసీఆర్ కుట్ర చేస్తున్నారని టీడీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు బీదా రవిచంద్ర విమర్శించారు.