Vyuham: వ్యూహం సెన్సార్ సర్టిఫికెట్ రద్దు కాలేదా ?- వర్మ ట్వీట్ క్లారిటీ..!
ఏపీ సీఎం వైఎస్ జగన్ జీవిత కథ ఆధారంగా టాలీవుడ్ దర్శకనిర్మాత రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన వ్యూహం చిత్రం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతోంది. ముఖ్యంగా ఏపీ ఎన్నికలకు ముందు వైఎస్ జగన్ పై నిర్మించిన ఈ చిత్రంలో విపక్ష నేతలు చంద్రబాబు, పవన్, నారా లోకేష్ ను టార్గెట్ చేస్తూ వర్మ పలు సన్నివేశాలు పెట్టడంపై విమర్శలు వచ్చాయి. ఇదే అభ్యంతరంతో నారా లోకేష్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది.

ఏపీలో ఎన్నికల వేళ సీఎం వైఎస్ జగన్ జీవితంలో కొన్ని ముఖ్య ఘట్టాల ఆధారంగా రాంగోపాల్ వర్మ తీసిన వ్యూహం చిత్రాన్ని అడ్డుకోవాలని కోరుతూ నారా లోకేష్ వేసిన పిటిషన్ పై విచారణ జరిపిన హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు ఓటీటీల్లో విడుదల కాకుండా ఆదేశాలు ఇచ్చింది. ఆ తర్వాత హైకోర్టులో సెన్సార్ సర్టిఫికెట్ రద్దు చేయాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్ధానం నిన్న మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. వీటిపై కలకలం రేగింది.
వ్యూహం చిత్రానికి గతంలో సెన్సార్ బోర్డు ఇచ్చిన సర్టిఫికెట్ ను నిరవధికంగా రద్దు చేస్తూ హైకోర్టు ఆదేశాలు ఇచ్చినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే వీటిపై స్పందించిన వర్మ... తాజాగా ఎక్స్ లో ఓ ట్వీట్ పెట్టారు. వ్యూహం చిత్రం సెన్సార్ సర్టిఫికెట్ కు సంబంధించి హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల సారాంశాన్ని ఆయన ట్వీట్ లో ఒక్క ముక్కలో తేల్చిచెప్పేశారు. ఇందులో వ్యూహం సినిమా సెన్సార్ సర్టిఫికెట్ రద్దు కాలేదని వర్మ తెలిపారు.
నిజం ఏమిటంటే సెన్సార్ బోర్డు నుంచి సర్టిఫికెట్ ఇవ్వడానికి సంబంధించిన రికార్డులు జనవరి 12 కల్లా సమర్పించాలని మాత్రమే హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చిందని వర్మ క్లారిటీ ఇచ్చారు. దీంతో వ్యూహం సెన్సార్ సర్టిఫికెట్ రద్దుపై జరుగుతున్న ప్రచారంపై వర్మ స్పష్టత ఇచ్చినట్లయింది.












Click it and Unblock the Notifications