తిరుమలలో టీటీడీ ఛైర్మన్, ఈఓ చేసిన సంయుక్త తనిఖీల్లో..!!
Tirumala: ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. శుక్రవారం నాడు 51,818 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 19,023 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 2.52 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది.
వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో రెండు కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. టోకెన్ లేని సర్వదర్శనం భక్తులకు స్వామివారి దర్శనానికి 6 నుంచి 8 గంటల సమయం పట్టింది. కంపార్ట్మెంట్లు, క్యూ లైన్లల్లో ఉన్న వారికి టీటీడీ సిబ్బంది, శ్రీవారి సేవకులు అల్పాహారం, పాలు, మంచినీరు పంపిణీ చేశారు.

రథ సప్తమి కోసం తిరుమలలో ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. శ్రీవారిని దర్శించుకోవడానికి భారీ సంఖ్యలో భక్తులు తిరుమలకు రావడం ఆనవాయితీగా వస్తోంది. ఈ దఫా రెండు నుంచి మూడు లక్షల మంది వరకు భక్తులు తిరుమలకు వస్తారని అధికారులు అంచనా వేస్తోన్నారు. దీనికి అనుగుణంగా ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఇప్పటికే టీటీడీ పాలకమండలి సమావేశమైంది. పలు నిర్ణయాలను తీసుకుంది. గత అనుభవాల దృష్ట్యా భక్తులకు ఇబ్బంది తలెత్తకుండా పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేస్తోంది. రథ సప్తమి నాడు సామాన్య భక్తులకు స్వామివారి దర్శన భాగ్యాన్ని కల్పించడానికి ప్రాధాన్యత ఇస్తోంది. ఈ క్రమంలో పలు సేవలు, ప్రివిలేజ్ దర్శనాలు రద్దు చేసింది.
ప్రొటోకాల్ ప్రముఖులు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలన్నీ రద్దయ్యాయి. బ్రేక్ దర్శనాలకు సంబంధించి ఫిబ్రవరి 3వ తేదీన ఎలాంటి సిఫారసు లేఖలను కూడా టీటీడీ సిబ్బంది స్వీకరించరు. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు ఉన్న భక్తులు వేచి ఉండకుండా నిర్ణీత సమయంలో మాత్రమే వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్ద రిపోర్ట్ చేయాలని విజ్ఞప్తి చేశారు.
తిరుమల నాలుగు మాడ వీధుల్లో భక్తుల కోసం చేపట్టిన ఏర్పాట్లను టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, పాలకమండలి సభ్యులు, కార్యనిర్వహణాధికారి జే శ్యామల రావు, అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి పరిశీలించారు. అధికారులకు సూచనలు చేశారు.
మాడ వీధుల్లో భక్తుల సౌకర్యార్థం వేసిన చలువ పందిళ్లు, గ్యాలరీల్లోకి భక్తుల ప్రవేశం, నిష్క్రమణ, అత్యవసర గేట్లు, భక్తులు నడిచే సమయంలో వేడి తగలకుండా వైట్ పెయింట్ తదితర ఏర్పాట్లను పరిశీలించారు. గ్యాలరీలలోని భక్తులకు ఎప్పటికప్పుడు పబ్లిక్ అడ్రెస్ సిస్టమ్ ద్వారా సమాచారం చేరవేసేలా ప్రకటనలు ఇవ్వాలని అధికారులకు సూచించారు.
భక్తులు గ్యాలరీలోకి ప్రవేశించాక వారికి కావాల్సిన అన్నప్రసాదాలు, తాగునీరు, మజ్జిగ తదితర సౌకర్యాలను క్రమం తప్పకుండా అందించాలని కోరారు. అనంతరం ఈఓ గాలిగోపురం, 7వ మైలులో ఆకస్మిక తనిఖీ చేశారు. గాలి గోపురం వద్ద వైద్యులు, మందుల లభ్యతను ఆయన పరిశీలించారు. 7వ మైలు వద్ద ఉన్న దుకాణాల శుభ్రతను తనిఖీ చేశారు.












Click it and Unblock the Notifications