ఏపీలో భారీ వర్షాలు: ఈ ఎనిమిది జిల్లాల్లో..!!
కడప: బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో రాయలసీమ జిల్లాల్లో ఆదివారం రాత్రి భారీ వర్షం కురిసింది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షం పడింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షపాతం నమోదైంది. కడప జిల్లాలో ఒకరు మృతి చెందారు. ఇవ్వాళ కూడా ఆయా జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ కేంద్రం తెలిపింది.
కోస్తా జిల్లాల్లోనూ చెదురు మదురు నుంచి ఓ మోస్తరు వర్షం కురుస్తుందని అంచనా వేశారు. రాయలసీమలోని కడప, అన్నమయ్య రాయచోటి, అనంతపురం, శ్రీసత్యసాయి పుట్టపర్తి జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షం కురిసింది. కొన్ని గంటల పాటు ఏకధాటిగా దంచికొట్టింది. బలమైన ఈదురుగాలులు దీనికి తోడయ్యాయి. భారీ చెట్లు సైతం నేలకు ఒరిగాయి. చేతికి అందివచ్చిన పంట దెబ్బతిన్నది.

అన్నమయ్య రాయచోటి జిల్లాలోని రాయచోటి, రాజంపేట, లక్కిరెడ్డిపల్లి, గాలివీడు, మదనపల్లి, తంబళ్లపల్లి, శ్రీసత్యసాయి పుట్టపర్తి జిల్లాలోని కదిరి, ధర్మవరం మండలాల్లో వర్షం బీభత్సాన్ని సృష్టించింది. పలు ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు నేలకు ఒరిగాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. కొన్ని చోట్ల వడగండ్లతో వర్షం కురవడం వల్ల చేతికి అందిన పంట దెబ్బతిన్నది.
అనంతపురంతో పాటు జిల్లాలోని రాయదుర్గం, కల్యాణదుర్గం, గుంతకల్లు, తాడిపత్రిలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం నమోదయింది. కడప జిల్లాలోని పులివెందుల, ముద్దనూరు, వీరపునాయునిపల్లిల్లో భారీ వర్షం పడింది. పులివెందులతో పాటు నియోజకవర్గం పరిధిలో పలు గ్రామాలు వర్షానికి అతలాకుతలం అయ్యాయి. గాలికి ఎగిరివచ్చిన రేకులు మీదపడటంతో బేతాయపల్లికి చెందిన చిన్న సుబ్బయ్య అనే వ్యక్తి మరణించాడు.

ఉత్తరాంధ్ర జిల్లాల్లో- ప్రత్యేకించి శ్రీకాకుళం జిల్లా- ఒడిశా సరిహద్దుల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. వర్షాల తీవ్రత ఇవ్వాళ కూడా కొనసాగే అవకాశాలు ఉన్నాయి. అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం, విజయనగరం, కోస్తా తీరంలోని కాకినాడ జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తుందని వాతావరణం కేంద్రం తెలిపింది. పిడుగులు పడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.












Click it and Unblock the Notifications