తప్పేమిటి, కెసిఆర్ నాకు మంచి మిత్రుడు: రేవంత్ రెడ్డికి రాయపాటి కౌంటర్
ఆంధ్రప్రదేశ్ మంత్రులు, టిడిపి నాయకులు తెలంగాణ ముఖ్యమంత్రితో స్నేహం చేసి, కాంట్రాక్టులు పొందుతున్నారనే తెలుగుదేశం తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను పార్టీ పార్లమెంటు సభ్యుడు రాయపాటి
Recommended Video

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ మంత్రులు, టిడిపి నాయకులు తెలంగాణ ముఖ్యమంత్రితో స్నేహం చేసి, కాంట్రాక్టులు పొందుతున్నారనే తెలుగుదేశం తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను పార్టీ పార్లమెంటు సభ్యుడు రాయపాటి సాంబశివ రావు తిప్పి కొట్టారు.
తెలంగాణ ప్రభుత్వం నుంచి ఆంధ్రప్రదేశ్ టిడిపి నాయకులు కాంట్రాక్టులు పొందడంలో తప్పేమీ లేదని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. ఆంధ్రప్రదేశ్ టిడిపి నాయకులు తెలంగాణ కాంట్రాక్టులు తీసుకుంటున్నారనే రేవంత్ రెడ్డి ఆరోపణల నేపథ్యంలో ఆయన మాట్లాడారు.
తెలంగాణ మంత్రులు యనమల రామకృష్ణుడు, పరిటాల సునీత, టిడిపి నేత పయ్యావుల కేశవ్లపై రేవంత్ రెడ్డి విరుచుకుపడిన విషయం తెలిసిందే.

చంద్రబాబు సిఫార్సు చేయలేదు...
తమ తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ నాయకులకు కాంట్రాక్టులు ఇవ్వాలని చంద్రబాబు ఏమీ సిఫార్సు చేయలేదని రాయపాటి సాంబశివ రావు అన్నారు. కెసిఆర్ తనకు మంచి మిత్రుడని, తాను కెసిఆర్ను కలిసి రూ. 5 వేల కోట్ల రూపాయల విలువ చేసే కాంట్రాక్టులు ఇవ్వాలని అడుగుతానని ఆయన చెప్పారు

పోలవరం కాంట్రాక్టులో నష్టం...
పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టులో తనకు విపరీతమైన నష్టం వచ్చిందని, నిర్మాణ వ్యయం పెరగడం వల్ల తనకు ఆ నష్టాలు వచ్చాయని రాయపాటి సాంబశివ రావు అన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తనకు ఆ కాంట్రాక్టు కేటాయించారని ఆయన చెప్పారు.

కేంద్రంపై నింద...
పోలవరం ప్రాజెక్టుకు, అమరావతి నిర్మాణానికి అవసరమైన నిధులను కేంద్రం ఇవ్వడం లేదని రాయపాటి సాంబశివ రావు విమర్శించారు. పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా గుర్తించిన విషయం తెలిసిందే. నిర్మాణ బాధ్యతలు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం చూస్తుంది.

రేవంత్ ఆరోపణలు ఏమిటి....
ఆంధ్రప్రదేశ్ మంత్రి యనమల రామకృష్ణుడికి కెసిఆర్ 2 వేల కోట్ల రూపాయల విలువ చేసే కాంట్రాక్టు ఇచ్చారని, మరో మంత్రి పరిటాల సునీత హైదరాబాదులో బీరు తయారీ కర్మాగారానికి లైసెన్స్ పొందారని రేవంత్ రెడ్డి విమర్శించారు. టిడిపి ఆంధ్రప్రదేశ్ నేత పయ్యావుల కేశవ్పై కూడా ఆయన విరుచుకుపడ్డారు. తాము పోరాటం చేస్తుంటే, ఆంధ్రప్రదేశ్ నాయకులు కెసిఆర్కు వత్తాసు పలుకుతున్నారనేది ఆయన అభ్యంతరం.












Click it and Unblock the Notifications