చిల్లర కాదు: కెసిఆర్, తెరాసలో రెడ్యానాయక్, కవిత
హైదరాబాద్: కాంగ్రెసు శాసనసభ్యుడు రెడ్యా నాయక్ తమ పార్టీలో చేరడం చిల్ల రాజకీయం కాదని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు అన్నారు. రెడ్యా నాయక్ తెరాసలో చేరడాన్ని కుటిల రాజకీయంగా చూడడం లేదని, అలా చూడడం సరి కాదని ఆయన అన్నారు. తెలంగాణ భవన్లో జరిగిన కార్యక్రమంలో కాంగ్రెసు శాసనసభ్యుడు రెడ్యా నాయక్తో పాటు ఆయన కూతురు, మాజీ శాసనసభ్యురాలు కవిత తెరాసలో చేరారు. గులాబీ కండువా కప్పి వారిని కెసిఆర్ పార్టీలోకి ఆహ్వానించారు.
రెడ్యా నాయక్ సేవలు తెలంగాణ ప్రభుత్వానికి ఎంతో అవసరమని కెసిఆర్ అన్నారు. రాష్ట్రంలోని ప్రతి గిరిజన తండాకు, గోండు గూడేనికి అభివృద్ధి ఫలాలు అందాలని ఆయన అననారు. తెలంగాణ పునర్నిర్మాణం ముఖ్యం కాబట్టి విభేదాలు మరిచి అందరూ ఏకమై ముందుకు సాగాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు.
గిరిజన తండాలను పంచాయతీలుగా అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. దళితులు, గిరిజనుల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. గిరిజనుల అభివృద్ధికి పాటుపడుతున్న ప్రభుత్వానికి అండదండలు అందించాలనే ఉద్దేశంతో రెడ్యా నాయక్ తమ పార్టీలో చేరారని కెసిఆర్ చెప్పారు. గిరిజనుల సంక్షేమం కోసం కనీవినీ ఎరుగని రీతిలో కార్యక్రమాలు చేయడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నామని ఆయన అన్నారు.
పార్టీలో గిరిజన నాయకులు ఐక్యంగా పనిచేయాలని ఆయన సూచించారు. గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లు కల్పించడానికి త్వరలో కమిషన్ వేస్తామని చెప్పారు. అందరూ విభేదాలు మరిచిపోయి ఏకం కావాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. పెళ్లి కావాల్సిన గిరిజన అమ్మాయిలకు 51 వేల రూపాయలేసి సహాయం చేస్తామని కెసిఆర్ చెప్పారు. రెడ్యా నాయక్, కవితలతో పాటు పలువురు కార్యకర్తలు తెరాసలో చేరారు. మరో శాసనసభ్యుడు ధర్మారెడ్డి ఈ నెల 9వ తేదీన తెరాసలో చేరే అవకాశం ఉంది.