మాజీ మంత్రి నారాయణకు ఊరట- సీఐడీ కేసులో హైకోర్టు ముందస్తు బెయిల్
ఏపీలో టీడీపీ ప్రభుత్వంలో మున్సిపల్ మంత్రిగా ఓ వెలుగు వెలిగిన నారాయణ విద్యాసంస్ధల అధినేత పొంగూరు నారాయణకు వైసీపీ ప్రభుత్వంలో మాత్రం ఇబ్బందులు తప్పడం లేదు. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ మార్చిన వ్యవహారంలో ఆయనపై సీఐడీ కేసు పెట్టింది. ఈ కేసులో అరెస్టు భయంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు.నారాయణ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.
అమరావతి మాస్టర్ ప్లాన్, ఇన్నర్ రింగ్ అలైన్ మెంట్ అక్రమాల వ్యవహారంలో సీఐడీ నమోదు చేసిన కేసులో నారాయణను అరెస్టు చేస్తారనే వార్తలు వినిపించాయి. ఆయనతో పాటు లింగమనేని ఎస్టేట్స్ అధినేత లింగమనేని రమేష్, రామకృష్ణ హౌసింగ్ సొసైటీ డైరెక్టర్ అంజనీకుమార్ అరెస్టు కూడా తప్పదనిపించింది. అయితే ఈ ముగ్గురు సీఐడీ కేసుపై హైకోర్టును ఆశ్రయించారు. తమను అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలని హైకోర్టును కోరారు. ఈ పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు ఇవాళ ముందస్తు బెయిల్ ఇస్తూ తీర్పునిచ్చింది.

అమరావతిలో ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ వ్యవహారంలో నారాయణ అక్రమాలు చేశారని నిరూపించడంలో ప్రాసిక్యూషన్ విఫలమైంది. రోడ్డు మంజూరు కాకుండానే అలైన్ మెంట్ లో అక్రమాలు జరిగాయని వాదించిన ప్రాసిక్యూషన్ కు భంగపాటు తప్పలేదు. దీంతో నారాయణతో పాటు లింగమనేని రమేష్, అంజనీకుమార్ కు హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. రాజకీయ దురుద్దేశంతోనే పిటిషనర్లపై సీఐడీ అక్రమ కేసులు పెట్టిందన్న వారి న్యాయవాదుల వాదనతో హైకోర్టు ధర్మాసనం ఏకీభవించింది.












Click it and Unblock the Notifications