YS Avinash Reddy : వైఎస్ అవినాష్ రెడ్డికి ఊరట- వివేకా నిందితుడిగా ఉన్న ఆ కేసు కొట్టేసిన కోర్టు..
ఏపీలో ప్రస్తుతం వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో విచారణ ఎదుర్కొంటున్న కడప ఎంపీకి మరో కేసులో విముక్తి లభించింది.
ఏపీలో ప్రస్తుతం వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణ తీవ్ర సంచలనంగా మారుతోంది. ఈ కేసులో ఇప్పటికే ఐదుగురు నిందితుల్ని అరెస్టు చేసిన సీబీఐ.. తెలంగాణలోని హైదరాబాద్ సీబీఐ కోర్టుతో పాటు హైకోర్టులోనూ దూకుడుగా ముందుకెళ్తోంది. అలాగే వైఎస్ వివేకా హత్య కేసులో అనుమానితుడిగా ఉన్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పాత్రను నిర్ధారించేందుకు ఆయన్ను రెండుసార్లు విచారించింది కూడా. ఈ క్రమంలో రాజకీయంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న అవినాష్ కు తాజాగా మరో కేసులో ఊరట లభించింది.
గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో కడప జిల్లాలో జరిగిన ఓ ధర్నాలో పాల్గొన్నందుకు వైఎస్ అవినాష్ రెడ్డితో పాటు మాజీ మంత్రి వివేకానందరెడ్డి, ప్రస్తుతం వివేకా కేసులో నిందితుడిగా ఉన్న దేవిరెడ్డి శివశంకర్ రెడ్డిపైనా కేసు నమోదైంది. ఈ కేసును విజయవాడలోని ప్రజా ప్రతినిధుల కోర్టు విచారణ జరుపుతోంది. ఈ కేసు విచారణ దశలో ఉండగానే వైఎస్ వివేకా హత్యకు గురయ్యారు. దీంతో ఆయన పేరు తొలగించారు. మిగిలిన ఇద్దరు నిందితులుగా అవినాష్, దేవిరెడ్డి శంకర్ రెడ్డిపై విచారణ జరిపిన న్యాయస్ధానం.. తాజాగా అవినాష్ కు ఊరటనిచ్చింది.

2015లో కడప జిల్లా తొండూరు పీఎస్ లో నమోదైన ధర్నా కేసు నుంచి వైఎస్ అవినాష్ రెడ్డికి విముక్తి కల్పిస్తూ విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టు తాజాగా తీర్పు ఇచ్చింది. అవినాష్ రెడ్డిపై ఈ కేసులో పోలీసులు మోపిన ఆరోపణలు రుజువు కాకపోవడంతో ఈ కేసును కొట్టేస్తూ కోర్టు తీర్పు ప్రకటించింది. ఈ కేసులో ఇప్పటికే పలుమార్లు ఇదే కోర్టుకు అవినాష్ హాజరయ్యారు. ఈ కేసులో మరో నిందితుడుగా ఉన్న దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి ప్రస్తుతం వివేకా కేసులో చంచల్ గూడ జైల్లో ఉండటంతో ఆయన్ను పోలీసులు ట్రాన్సిట్ వారంట్ తో విజయవాడ కోర్టుకు తెచ్చి హాజరుపరిచారు. మొత్తం మీద వివేకా కేసులో ప్రస్తుతం విచారణ ఎదుర్కొంటున్న అవినాష్.. అదే వివేకాతో కలిసి సహనిందితుడిగా ఉన్న కేసులో ఊరట పొందడం విశేషం.












Click it and Unblock the Notifications