జగన్ పైన తదుపరి చర్యలు తీసుకోకుండా హైకోర్టు స్టే
హైదరాబాద్: ఎన్నికల సమయంలో కోడ్ ఉల్లంఘన కేసులో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి గురువారం ఊరట లభించింది. జగన్ కోడ్ ఉల్లంఘన కేసులో రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు స్టే విధించింది. జగన్ పైన తదుపరి చర్యలు తీసుకోకుండా హైకోర్టు స్టే విధించడం ఆయనకు ఊరట.
కాగా, ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనకు సంబంధించి నల్గొండ జిల్లాలోని కోదాడలో దాఖలైన కేసు నుంచి తనకు విముక్తి కలిగించాలని వైయస్ జగన్ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆయన బుధవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

ఇటీవలి సాధారణ ఎన్నికల సందర్భంగా నల్లగొండ జిల్లా కోదాడలో తాను ఎన్నికల ప్రవర్తనా నియమావళిను ఉల్లంఘించినట్లు వివిధ సెక్షన్ల కింద పోలీసులు ఎఫ్ఐఆర్ దాఖలు చేశారని ఆయన గుర్తు చేశారు.
ఈ కేసులో విచారణతో పాటు తన అరెస్టు వంటి తదుపరి చర్యలను నిలిపేయాలని ఆయన కోర్టును కోరారు. ఈ ఏడాది ఏప్రిల్ 26వ తేదీన తాను కోదాడలో ఏ విధమైన ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించలేదని, అనుమతి లేకుండా తాను రోడ్ షో నిర్వహించి, 65 నెంబర్ జాతీయ రహదారిపై ట్రాఫిక్కు అంతరాయం కలిగించానని తనపై చేసిన ఆరోపణల్లో నిజం లేదని ఆయన అన్నారు.
అధికారుల నుంచి తగిన అనుమతి పొందిన తర్వాతనే తాను బహిరంగ సభ నిర్వహించానని ఆయన చెప్పారు. దుదురుద్దేశ్యపూర్వకంగా తనపై ఎఫ్ఐఆర్ దాఖలు చేశారని ఆయన ఆరోపించారు. ఆ ఎఫ్ఐఆర్ను కొట్టేయాలని ఆయన హైకోర్టును కోరారు. హైకోర్టు దీనిపై ఇప్పుడు స్టే విధించింది.












Click it and Unblock the Notifications