రేణిగుంట విమానాశ్రయానికి శ్రీవారి పేరు.. కేంద్రానికి సిఫార్సు!
రేణిగుంట విమానాశ్రయానికి శ్రీవేంకటేశ్వర అంతర్జాతీయ విమానాశ్రయంగా పేరు మార్చేందుకు కేంద్రానికి సిఫార్సు చేయనున్నట్టు టిటిడి చైర్మన్ బి ఆర్ నాయుడు వెల్లడించారు. రేణిగుంట విమానాశ్రయం పేరు మార్చడంతో పాటు తిరుమలకు ఐకానిక్ గా ఉన్న విమానాశ్రయానికి ఆధ్యాత్మిక శోభను తీసుకురావడానికి కేంద్ర విమానయాన శాఖకు సిఫార్సు చేయనున్నట్లు టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడు పేర్కొన్నారు.
టీటీడీ ధర్మకర్తల మండలి నిర్ణయాలను వెల్లడించిన టీటీడీ చైర్మన్
తిరుమలలోని టిటిడి చైర్మన్ క్యాంపు కార్యాలయంలో నేడు టీటీడీ ధర్మకర్తల మండలిలో తీసుకున్న నిర్ణయాలను వెల్లడించిన ఆయన బెంగళూరులోని ప్రధాన ప్రాంతంలో కర్ణాటక సీఎం, డిప్యూటీ సీఎంల అభ్యర్థనతో శ్రీవారి ఆలయాన్ని నిర్మించాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. కేంద్ర భారీ పరిశ్రమలశాఖ మంత్రి హెచ్డి కుమారస్వామి కేంద్ ప్రభుత్వం నుంచి టీటీడీకి 100ఎలక్ట్రిక్ బస్సులు కేటాయించేందుకు ముందుకు రావడంతో త్వరలోనే బస్సులను తిరుమలకు తీసుకువచ్చేందుకు చర్యలు చేపట్టినట్టుపేర్కొన్నారు.

ఢిల్లీ టీటీడీ కళాశాల ఆధునికీకరణ,తిరుపతిలో సీఎస్ఐఆర్ ల్యాబ్ కు టీటీడీ స్థలం లీజ్
న్యూఢిల్లీలోని ప్రతిష్టాత్మక టీటీడీ కళాశాలను ఆధునీకరించాలని నిర్ణయం తీసుకున్నట్టు ఆయన వెల్లడించారు.కేంద్ర ప్రభుత్వం తిరుపతిలో ఏర్పాటు చేయనున్న సీఎస్ఐఆర్ ల్యాబ్ కు లీజ్ పద్ధతిలో టీటీడీ స్థలాన్ని కేటాయించాలని నిర్ణయించినట్టు తద్వారా టిటిడి వినియోగించే నెయ్యి, నీరు, ఆహార పదార్థాల నాణ్యతను తనిఖీ చేసేందుకు అవకాశం ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
కాంట్రాక్ట్ లెక్చరర్ ల సమస్య పరిష్కారానికి త్రిసభ్య కమిటీ
టీటీడీలోని లెక్చరర్ పోస్టుల భర్తీని నిలిపివేయాలని ఏపీపీఎస్సీకి సిఫార్సు చేస్తున్నట్లు, ఇప్పటికే పనిచేస్తున్న 200 మంది కాంట్రాక్టు లెక్చరర్ల సమస్యను పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసినట్టు తెలిపారు.అంతేకాదు సేవా సమరసత ఫౌండేషన్ సహకారంతో ప్రస్తుతం నిర్వహిస్తున్న అర్చకుల శిక్షణ కార్యక్రమం తో పాటు, వ్రతాలు, పూజా విధానాలలో కూడా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.
పలు శిక్షణా కార్యక్రమాల నిర్వహణపై నిర్ణయం
టిటిడి విద్యా సంస్థలోని విద్యార్థులకు హిందూ సనాతన ధార్మిక విలువలతో పాటు, తెలుగు సాంస్కృతిక వైభవంలో శిక్షణ ఇవ్వడంలో భాగంగా మన వారసత్వం అనే కార్యక్రమాన్ని ప్రారంభించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. విద్యార్థుల్లో హైందవ సనాతనధర్మం నేర్పిన మానవీయ విలువలను, వ్యక్తిత్వవికాస కార్యక్రమాలలో శిక్షణ ఇవ్వడానికి సద్గమయ కార్యక్రమాన్ని టీటీడీకి చెందిన ఏడు పాఠశాలల్లోని దాదాపు 1600మంది విద్యార్థులకు డే స్కాలర్ విధానంలో శిక్షణ ఇవ్వడానికి నిర్ణయించినట్లు టిటిడి చైర్మన్ తెలిపారు.
ఈ ప్రత్యేక కార్యక్రమాల నిర్వహణకు నిర్ణయం
వరలక్ష్మీ వ్రతం పర్వదినాన తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో సౌభాగ్యం పేరుతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. అక్షర గోవిందం, భగవద్గీత అనుష్టాన బోధన, హరికథా వైభవం, భజే శ్రీనివాసం, వన నిధి, గిరి జనార్దనం, సన్మార్గం వంటి కార్యక్రమాలను నిర్వహించి జనబాహుళ్యంలో కి విస్తృతంగా తీసుకువెళ్లడానికి చర్యలు తీసుకోవాలని నిర్ణయించినట్టు పేర్కొన్నారు.
యోగాకు ప్రత్యేక కార్యక్రమం
జూన్ 21వ తేదీన యోగ దినోత్సవం సందర్భంగా టిటిడి పరిపాలన భవన మైదానంలో కార్యక్రమాన్ని నిర్వహించడానికి నిర్ణయం చేసినట్టు పేర్కొన్నారు. ఇక టీటీడీ ధర్మకర్తల మండలి నిర్వహించిన కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ, పనబాక లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications