భార్యపై సహోద్యోగి వేధింపులు: ఏం చేయలేకపోతున్నానని రిపోర్టర్ ఆత్మహత్య
విశాఖపట్నం: రైల్వే ఉద్యోగి అయిన తన భార్యను ఆమె సహోద్యోగి వేధిస్తున్నా తాను ఏమీ చేయలేని స్థితిలో మిగిలిపోయాననే మనస్తాపంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నంలో ఓ విలేకరి ఆత్మహత్యకు పాల్ప డ్డారు. రైల్వే న్యూ కాలనీలోని క్వార్టర్స్లో శుక్రవారం ఈ సంఘటన జరిగింది.
ఎంవీ శేఖర్(50) అనే వ్యక్తి ఓ దినపత్రికలో విలేకరిగా పనిచేస్తున్నారు. రైల్వేలోని ఎలక్ర్టికల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న ఆయన భార్య నాగమణిని కొంతకాలంగా అదే శాఖలో పనిచేస్తున్న సెక్షన్ ఇంజనీర్ మోహనరావు వేధిస్తున్నాడు. ఈ విషయం తెలిసి శేఖర్ రైల్వే ఉన్నతాధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేశారు. ఉన్నతాధికారుల నుంచి ఎటువంటి స్పందన లేదు. పైగా మోహన్రావు నుంచి వేధింపులు అధికమయ్యాయి. ఈ వేధింపులపై డీఎంఆర్కు ఫిర్యాదు చేయగా, రైల్వే మహిళా సెల్లో ఫిర్యాదు చేయాలని సూచించారు.
ఇదిలావుంటే, నాగమణి విధులకు సరిగా హాజరుకావడం లేదని, అప్పగించిన పని చేయడం లేదని గురువారం సెక్షన్ ఇంజనీర్ మోహనరావు మెమో జారీ చేశారు. దీంతో మనస్తాపానికి గురైన శేఖర్ శుక్రవారం ఉదయం తమకు చెందిన మరో ఇంట్లో ఉరేసుకున్నారు.
దీంతో తన భర్త ఆత్మహత్యకు కారకులైన రైల్వే అధికారులపై చర్యలు తీసుకోవాలని నాగమణి శుక్రవారం డీఆర్ఎం కార్యాలయం ఎదుట మృతదేహంతో నిరసనకు దిగారు. శాఖాపరంగా తనకు తగిన న్యాయం చేయాలని వాల్తేరు డివిజన్ అదనపు డివిజనల్ మేనేజర్కు విజ్ఞప్తి చేశారు. ఆమె నిరసనకు నగరంలోని పలువురు జర్నలిస్టులు సంఘీభావం తెలిపారు.