వివాదం: స్పీకర్ను జగన్ బెదిరించారని కాల్వ శ్రీనివాసులు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశం(బీఏసీ)లో ప్రతిపక్షనేత, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి హాట్ కామెంట్ చేసినట్లు శనివారం మీడియాలో వార్తలు వచ్చాయి. తాను మాట్లాడడానికి అడిగినంత సమయం ఇవ్వకపోతే సభలో అభ్యంతరకర దృశ్యాలు చూడాల్సి వస్తుందని జగన్ వ్యాఖ్యానించారంటూ ఓ ప్రముఖ తెలుగు మీడియా వార్తాకథనాన్ని ప్రచురించింది.
జగన్ చేసిన ఈ వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయంటూ కూడా ఆంధ్రజ్యోతి మీడియా వ్యాఖ్యానించింది. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాద్రెడ్డి ఖండించారు. జగన్ వ్యాఖ్యలను స్పీకర్తో పాటు పలువురు మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలు తప్పుబట్టారు.

బీఏసీ సమావేశంలో స్పీకర్ కోడెల శివప్రసాద్ను జగన్ మోహన్రెడ్డి బెదిరించారని చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు వెల్లడించారు. శనివారం మీడియా సమావేశంలో ఆయన ఆ విషయం చెప్పారు. అడిగినంత సమయం ఇవ్వకపోతే చూడకూడని సంఘటనలు సభలో చూడాల్సి వస్తుందని జగన్ అన్నారని చెప్పారు. సీఎంకు ఇచ్చినంత సమయం తనకూ ఇవ్వాలని డిమాండ్ చేశారని కాల్వ తెలిపారు. మంత్రుల వివరణ సమయాన్ని కూడా టీడీపీ ఖాతాలో వేయాలనడం జగన్ అవగాహనా రాహిత్యానికి నిదర్శనమని ఆయన మండిపడ్డారు. వైఎస్, జగన్ అండదండలతోనే ఎర్రచందనం స్మగ్లింగ్, బెరైటీస్ అక్రమాలు జరిగాయని చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
గవర్నర్ ప్రసంగంపై చెవిరెడ్డి అసంతృప్తి
ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగంపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యులు అసంతృప్తి వ్యక్తం చేశారు. శనివారం అసెంబ్లీ ఆవరణలో వారు మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర గవర్నర్ చేత పచ్చి అబద్దాలు చెప్పించిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకే దక్కుతుందని విమర్శించారు.
సభలో అనేక ప్రజా సమస్యలపై చర్చించాల్సి ఉందని, ప్రభుత్వం చర్చలకు నిర్ధేశించిన 16 రోజుల కాలం ఏమాత్రం సరిపోదన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో జరిగిపినట్లుగానే బడ్జెట్ సమావేశాలను 40 రోజులపాటు నిర్వహించాలని డిమాండ్ చేశారు.
12న ఎపి బడ్జెట్ ప్రతిపాదన
ఏపీ బడ్జెట్ను ఈ నెల 12వ తేదీన 12 గంటలకు శాసనసభలో ప్రవేశపెట్టనున్నట్లు రాష్ట్ర ఆర్థిక శాఖమంత్రి యనమల రామకృష్ణుడు వెల్లడించారు. గవర్నరు ప్రసంగం బాగుందని మంత్రి పేర్కొన్నారు. అన్ని అంశాలను గవర్నరు ప్రసంగంలో చేర్చినా వైసీపీ అనవసర రాద్ధాంతం చేస్తుందని మంత్రి ఆరోపించారు.
ధరల పెరుగుదల వల్లే వివిధ ప్రాజెక్టులు, రోడ్ల నిర్మాణాల వ్యయం పెంచాల్సి వస్తుందన్నారు. వైఎస్ హయాంలోని ప్రాజెక్టులు, రోడ్ల నిర్మాణ పనులు కాంట్రాక్టర్లకు భారంగా మారాయని అందుకే వ్యయం పెంచాల్సివస్తుందన్నారు. రాజధాని నిర్మాణం కోసం బలవంతంగా భూములు తీసుకోలేదని, వైసీపీ ఎంపీపీలు, జడ్పీటీసీలు కూడా భూములిచ్చారని మంత్రి వివరించారు.












Click it and Unblock the Notifications